జగన్ పార్టీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్: ఎమ్మెల్యేకు సెగ
పలుచోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ నందమూరి తారక రామారావులతో పాటు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ల ఫోటోలను తమ ఫ్లెక్సీలలో పెట్టుకున్నారు.
తాజాగా మాస్టర్ ఫోటో పెట్టుకోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు అత్యుత్సాహంతో కూన చేరిక సభకు విజయమ్మను ఆహ్వానిస్తూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో విజయమ్మ, జగన్, కూన శ్రీశైలంలతో పాటు సచిన్ టెండుల్కర్ ఫోటోను ఉంచారు. దీనిపై సచిన్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.
కూన రాకను వ్యతిరేకిస్తున్న కార్పోరేటర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్ రాకను సూరారం కార్పోరేటర్ సురేష్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కూన రాకను వ్యతిరేకిస్తూ ఆయన వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. వీటిని కూన వర్గం తీసేసింది. సురేష్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టిక్కెట్ పై ఆశతో పార్టీలో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తుండటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.