పోల్స్: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పడిగాపులు
పోలింగ్ సిబ్బంది వచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సరిచేసుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకునేసరికి అరగంటకు పైగా సమయం పట్టింది. అంతసేపూ సాఫ్ట్వేర్ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఓటు వేయడానికి ఎదురు చూస్తూ ఉండిపోయారు. జయనగర్ నియోజకవర్గం పరిధిలోని విజయా కాలేజి పోలింగ్బూత్ వద్ద ఆయన ఓటు వేశారు.
పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు మూడు గంటల్లోనే తుముకూరులోని సిద్దగంగ మఠానికి చెందిన 106 ఏళ్ల శివకుమార్ స్వామి, సీఎం జగదీష్ శెట్టర్, బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు, అనంతకుమార్, నటి రమ్య, కేంద్రమంత్రులు మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, అసెంబ్లీలో విపక్షనేత సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, కేజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓట్లేశారు.
బీదర్లో అత్యల్పం
కర్ణాటక శాసనసభలోని 223 స్థానాలకు ఆదివారం పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్కుమార్ ఝా ప్రకటించారు. ఆదివారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి ఓట్లు వేసేందుకు గంట అదనపు సమయం కేటాయించడంతో పోలింగ్ 70%కు చేరుకోవచ్చని అంచనా వేశామని చెప్పారు. అత్యధికంగా హాసన్లో 71.6%, హావేరీలో 70.83% పోలింగ్ నమోదైందన్నారు.
బీదర్లో అత్యల్పంగా 48.5% పోలింగ్ నమోదైంది. రిటర్నింగ్ అధికారుల డైరీలను సోమవారం పరిశీలించాక రీ పోలింగ్ అవసరం ఉందో లేదో నిర్ణయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 36 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఝా చెప్పారు. 8వ తేదీ మధ్యాహ్నం నాటికి పూర్తిగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు.