వాకింగ్, ఫ్లయింగ్: కిరణ్, బాబులకు విజయమ్మ చురక
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ఆడిస్తున్నాయని, నాశనం చేస్తున్నాయన్నారు. నాటి చంద్రబాబు పాలనకు, నేటి కిరణ్ పాలనకు ఏమీ తేడా లేదని ఆమె అభిప్రాయపడ్డారు. వెన్నుపోట్లు అనగానే గుర్తొచ్చే ఏకైక నాయకుడు బాబేనని గుర్తు చేశారు. ఆయన నిజాయితీపరుడని ఏ కోర్టు చెప్పిందని ప్రశ్నించారు. ‘ఈనాడు' రామోజీరావు, ‘జయభేరి' మురళీ మోహన్, సత్యం రామలింగరాజు, సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు తదితరులకు బాబు ఎన్నిరకాలుగా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నింటినీ కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో వైయస్ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ప్రజలపై భారం పెంచుతున్నాయని విమర్శించారు. రైతులకు క్రాప్ హాలిడేలా కార్మికులు కూడా పవర్ హాలిడేలతో కుదేలవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
వైయస్ హయాంలో ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు మాత్రం పేద ప్రజలపై కేవలం కరెంట్ చార్జీల రూపంలోనే రూ.20 వేల కోట్ల పై చిలుకు భారం మోపారన్నారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ... పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అలాగే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.