ఎంకి పెళ్లి సుబ్బి చావుకి: కన్నడ పోల్స్తో జగన్కు లింక్
కర్నాటక ప్రజలు అవినీతి భారతీయ జనతా పార్టీని ఓడించారని, అక్కడ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే కాంగ్రెసు పార్టీని గెలిపించారని టిడిపి నేతలు చెబుతున్నారు. అవినీతిని ఆ రాష్ట్ర ప్రజలు ఛీత్కరించుకున్నారని అందుకే కాంగ్రెసు పార్టీ గెలిచిందంటున్నారు. అలాగే ఎపిలో కూడా వచ్చేసారి అవినీతి వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలను ప్రజలు తిప్పికొడతారని, టిడిపి గెలుపు ఖాయమని చెబుతున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఎవరికి వారు కర్నాటక ఎన్నికలను తమకు అన్వయించుకొని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. కర్నాటకలో అవినీతికి పాల్పడిన బిఎస్సార్ పార్టీ తుడిచి పెట్టుకు పోయిందని అలాగే ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పని కూడా అంతేనని కాంగ్రెసు నేతలు అంటున్నారు.
అవినీతిని ప్రోత్సహించిన బిజెపి, అవినీతికి పాల్పడిన బిఎస్సార్, కెజెపి పార్టీలు దారుణ ఓటమి చెందాయని వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించిన, చేసిన కాంగ్రెసు, చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడుతాయని టిడిపి నేతలు చెబుతున్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడనాట బిఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు, టిడిపిలు నిత్యం జగన్ పార్టీతో పోలుస్తుంటాయి.
అవినీతి బిఎస్సార్ పార్టీ కర్నాటక ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిందని.. ఇక్కడ జగన్ పార్టీ కూడా అంతేనని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. సానుభూతి ఎప్పుడూ పని చేయదన్నారు. అవినీతితో పుట్టిన శ్రీరాములు పార్టీ కర్నాటకలో కొట్టుకుపోయినట్లుగానే రాష్ట్రంలోని అవినీతి పార్టీ కూడా తుడిచి పెట్టుకుపోతుందన్నారు.