పురంధేశ్వరిపై చెప్పుడు మాటలు: సోనియా డుమ్మా?
మాజీ ప్రధాని పివి నరసింహారావు భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనివ్వకుండా చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చాలామంది తప్పుబట్టారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకుండా సోనియాగాంధీ తప్పు చేశారని అంటున్నారు. కొద్దిమంది ఎంపీల చెప్పుడు మాటలు విని సోనియా తన స్థాయికి భిన్నంగా వ్యవహరించారని అంటున్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల తామెలా వెళ్తామని పనబాక లక్ష్మి, కేఎస్రావు, సాయిప్రతాప్, అనంత వెంకటరామిరెడ్డి చెప్పడం వల్ల, మరో ఒకరిద్దరు పార్లమెంటు సభ్యులు ఆమెకు ఇచ్చిన సలహా వల్ల సోనియా రాలేదని అంటున్నారు.
సోనియా గాంధీ రావడం లేదని తెలిసినా కేంద్రమంత్రులు జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, బాపిరాజు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి విగ్రహావిష్కరణకు వచ్చారు. కేవలం పురందేశ్వరి పట్ల వ్యతిరేకతతోనే కొందరు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని, సోనియాను కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని వ్యాఖ్యానాలు వినపడ్డాయి. ఏమైనా ఈ కార్యక్రమానికి వెళ్లే విషయంలో కాంగ్రెస్ ఎంపీలలో చీలికలు స్పష్టంగా కనపడ్డాయి.
చంద్రబాబుకు ప్రాధాన్యం లభించినా ఈ కార్యక్రమం సుఖాంతం అయినందుకు పలువురు పురందేశ్వరిని అభినందించారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ప్రత్యేకంగా పురందేశ్వరిని పిలిచి ఆహ్వానాల విషయంలో తాను ప్రశ్నించినందుకు ఏమీ అనుకోకూడదని, కార్యక్రమం బాగా జరిగిందని అభినందించారు.