యజమాని మాటలే..: సిబిఐ పంజరంలో చిలుక: సుప్రీం
దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఎక్కడుందని ప్రశ్నించింది. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్న సిబిఐని కూడా మందలించింది. కీలక కేసుల దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రకాల ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కోవాలని, బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు నివేదికను న్యాయశాఖ మంత్రి సహా ఎవరితోనూ పంచుకోవద్దని, దీనికి సిబిఐ డైరెక్టర్ నేరుగా బాధ్యత వహించాలని ఆదేశించింది.
సిబిఐని స్వతంత్ర సంస్థగా మారుస్తామంటూ హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా కోరింది. దానికి స్వేచ్ఛనివ్వని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. అదే సమయంలో సిబిఐకి అసాధారణ అధికారాలివ్వడం కూడా కుదరదని జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సిబిఐకి స్వతంత్రత కల్పించేందుకు జూలై 10లోగా ప్రత్యేక చట్టం చేయాలని, ఇందుకు చేపట్టిన చర్యలపై అదే రోజున అఫిడవిట్ సమర్పించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ అంశంపై బుధవారం మూడు గంటలపాటు సాగిన విచారణలో అటార్నీ జనరల్ జీఈ వాహనవతి, అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్, ప్రధాని కార్యాలయం, బొగ్గుశాఖ అధికారులపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తు నివేదికలో అధికారులు మార్పులు ఎలా చేయగలిగారని మండిపడింది. దర్యాప్తుతో వారికి సంబంధమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ సూచనల మేరకు నివేదిక ఆత్మనే మార్చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ సూచన మేరకే తాను సిబిఐ అధికారులతో భేటీ అయ్యానని, సిబిఐ నివేదిక కాపీని తాను కోరలేదని అటార్నీ జనరల్ వాహనవతి కోర్టుకు తెలిపారు. ఇక బొగ్గు కుంభకోణం దర్యాప్తులో ఇప్పటికీ పెద్దగా పురోగతి లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో బొగ్గుస్కాంపై దర్యాప్తు జరిపిన డిజిపి రవికాంత మిశ్రాకే తిరిగి ఈ కేసు బాధ్యతలు అప్పగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, సిబిఐని ఆదేశించింది.