2శాతం ఓట్లతో కాంగ్రెస్కు పవర్!: 10శాతం చీల్చిన యడ్డీ
ఈసారి కాంగ్రెసు గతంలో కంటే కేవలం కేవలం రెండు శాతం ఓట్లను మాత్రమే ఎక్కువగా సాధించి ఏకంగా 41 సీట్లను ఎక్కువ సాధించింది. అందుకు బిజెపి ఓట్లను కెజెపి, బిఎస్సార్ కాంగ్రెసు చీల్చడంతో పాటు నిలకడలేని ప్రభుత్వమనే అభిప్రాయం ప్రజల్లో కలగడమే. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో 80 స్థానాలు వస్తే, ఈసారి మాత్రం 37 శాతం ఓట్లతో 121 స్థానాలు లభించాయి. తద్వారా 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యతను సంపాదించగలిగింది.
గత ఎన్నికల పరిస్థితిని చూస్తే అప్పట్లో బిజెపికి కాంగ్రెస్ కంటే ఒక్కశాతం ఓట్లు తక్కువగా వచ్చినా, ఏకంగా 110 స్థానాలను సొంతం చేసుకుంది. అది కాంగ్రెస్ బలం కంటే 30 ఎక్కువ. అప్పట్లో బిజెపిలో గాలి జనార్దన రెడ్డి, యడ్యూరప్ప లాంటి నేతలు ఉన్నారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్ కేసులో గాలి అరెస్టయ్యి చంచల్గూడ జైలులో ఉండగా, ఆయన అనుంగు సహచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తింది.
బిజెపి ఓటమే లక్ష్యంగా పెట్టుకున్న యడ్యూరప్ప అనుకున్నంత పనీ చేశారు. బిజెపి ఓటు బ్యాంకు లోంచి 10 శాతం ఓట్లను లాగేసుకున్నారు. లింగాయత్ ఓటర్లలో అత్యధికులు యడ్యూరప్పకే మద్దతు పలికారు. అంత చేసినా ఆయనకు దక్కినవి ఆరు స్థానాలే. పార్టీ విజయానికి తగినన్ని ఓట్లు సాధించలేకపోయిన యడ్డి.. బిజెపిని ఓడించడానికి మాత్రం ఉపయోగపడింది. జెడిఎస్ ఒక్కశాతం ఓట్లు పెంచుకుని 12 సీట్లు అదనంగా సాధించింది. కెజెపి, బిఎస్సార్ కాంగ్రెసు పార్టీల ప్రభావం కారణంగా బిజెపి దాదాపు వంద స్థానాల్లో దెబ్బతిన్నదని చెబుతున్నారు.