రెండు వికెట్లు డౌన్: బన్సల్, అశ్వినీ కుమార్ రాజీనామా
విజయ్ సింగ్లా గతవారం అరెస్టయ్యాడు. కేసు విషయంలో త్వరలోనే బన్సల్ను విచారిస్తామని సిబిఐ వర్గాలు చెప్పాయి. సిబిఐ వేయి ఫోన్ కాల్స్ను ట్రాక్ చేసింది. వీటిలో పలు సార్లు బన్సల్ పేరు వచ్చింది. ఏం జరిగినా తన మామ చూసుకుంటాడని విజయ్ సింగ్లా చెప్పినట్లు సమాచారం. నిజానికి, ఇంతకు ముందే బన్సల్ రాజీనామా చేయాలని అనుకున్నారు.
కేసు దర్యాప్తు ముగిసే వరకు ఆగాలని కాంగ్రెసు పెద్దలు చెప్పడంతో ఆయన రాజీనామా చేయడాన్ని వాయిదా వేసుకున్నారు. కొత్త ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కలిసిన కొద్దిసేపటికే బన్సల్ రాజీనామా చేశారు.
బన్సల్ రాజీనామ చేసే ముందు కొన్ని ఫైళ్లను క్లియర్ చేసినట్లు సమాచారం. ఫైళ్లను క్లియర్ చేసి ఆయన తన సొంత కారులో ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. తన నివాసంలో ఆయన కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం. దోష నివారణకు ఓ మేకతో ఆయన క్రతువు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశానికి బన్సల్ హాజరు కాలేదు. దాంతోనే ఆయన మంత్రివర్గం నుంచి తొలుగుతారనే విషయం స్పష్టమైంది. బన్సల్ ఫ్రైవేట్ కార్యద్రశి రాహుల్ భండారీని సిబిఐ విచారించింది. సింగ్లాతో తనకు ఏ విధమైన వ్యాపార సంబంధాలు లేవని బన్సల్ అన్నారు.
బన్సల్ తన రాజీనామా లేఖను సమర్పించిన వెంటనే అశ్విన్ కుమార్ కూడా వచ్చి తన రాజీనామా లేఖను అందజేశారు. కోల్ గేట్ వ్యవహారంలో సిబిఐ నివేదికను మార్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అశ్వినీ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అశ్వినీ కుమార్కు నివేదికు చూపించడంపై సిబిఐ మీద సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.