కిరణ్కు ఢిల్లీ రాజీనామాల సెగ: విహెచ్, శంకరన్న ఫైర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కునేవారిని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించబోరని, కేంద్రంలో ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించారని, రాష్ట్రంలో కూడా కళంకిత మంత్రులను తొలగించడం మంచిదని హనుమంతరావు అన్నారు. సోనియా మాదిరిగానే కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
కళంకిత మంత్రులు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే మంచిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లనే కర్ణాటకలో కాంగ్రెసుకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. అవినీతిని సోనియా గాంధీ సహించబోరని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ అస్తుల కేసులో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారు రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను మంత్రివర్గంలో ఎలా కొనసాగనిస్తారని ఆయన అడిగారు.