కర్నాటక ఎన్నికలు: బ్లాగ్లో అద్వానీ సంచలన వ్యాఖ్య
కర్నాటక ఎన్నికల్లో బిజెపి ఓటమికి విచారిస్తున్నానని, అయితే అక్కడ పార్టీ ఓడిపోవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు. గెలిచి ఉంటే ఆశ్యర్యపోవాల్సి వచ్చేదన్నారు. కర్నాటక సంక్షోభాన్ని పరిష్కరించడంలో పార్టీ సక్రమంగా వ్యవహరించలేకపోయిందని అభిప్రాయపడ్డారు.
అక్కడి వ్యవహారాల చక్కబెట్టడంలో అవకాశవాదమే కనిపించిందన్నారు. యడ్యూరప్ప అవినీతిలో కూరుకుపోయారని స్పష్టమైన వెంటనే పార్టీ ఆయనపై గట్టి చర్యలు తీసుకొని ఉండాల్సిందన్నారు. అలా జరిగి ఉంటే తర్వాత పరిణామాలు వేరేగా ఉండేవన్నారు. కర్నాటక ఎన్నికల నుంచి బిజెపితో పాటు, అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెసు కూడా ఓ గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందన్నారు.
రాజకీయ పార్టీల అనైతిక ప్రవర్తనను సహించేది లేదని కర్నాటక ఓటర్లు స్పష్టం చేశారన్నారు. అవినీతి వల్ల ఇప్పుడు కర్నాటకలో బిజెపి దెబ్బతిన్నదని, ఇలాగే కేంద్రంలో అధికారం చెలాయిస్తూ, అనేక కుంభకోణాల్లో మునిగితేలుతున్న కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఓటర్లు తిరగబడటం ఖాయమన్నారు.