వైయస్ అవినీతిలో కన్నాకు వాటా: కోడెల వ్యాఖ్య
గజదొంగకు ఇంట్లో అశ్రమిచ్చి దొంగ సొమ్మును పంచుకున్న ఘనచరిత్ర కన్నా లక్ష్మినారాయణదని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో ఒకప్పుడు కన్నా లక్ష్మినారాయణకు ఇల్లు లేదని, ఇప్పుడు రాజమహల్ వచ్చిందని ఆయన అన్నారు. కన్నా లక్ష్మినారాయణ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాదిరిగా ఆస్తులు ప్రకటించాలని ఆయన కన్నాకు సవాల్ విసిరారు. తాము విమర్శిస్తే రాజకీయ ఆరోపణలని కొట్టిపారేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏమంటారని ఆయన అడిగారు. విశాఖ ఫార్మాలో కన్నాకు పది ఎకరాల స్థలం ఉందని ఆయన ఆరోపించారు.
కన్నా లక్ష్మీనారాయణ నూజివీడిలో దేవాలయ భూములను కాజేశారని ఆయన అన్నారు. సిగ్గు శరం లేకుండా కన్నా లక్ష్మినారాయణ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. రుణాలు మాఫీ చేయద్దని గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని కోడెల అన్నారు. వైయస్ హయాంలో 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అదనంగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదని ఆయన ఆయన అన్నారు.
నీటి పారుదలకు బడ్జెట్లో 2 శాతం నిధులు మాత్రమే కేటాయించారని, జలయజ్ఞం పేరుతో జనాలను మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆయన అన్నారు. కన్నా, ఆయన కుమారుడి ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో దూళిపాళ నరేంద్ర చౌదరి కూడా పాల్గొన్నారు.