వైయస్ జగన్ కేసు: ఒత్తిడిలో కళంకిత మంత్రులు
వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులు ఇరుక్కున్నారు. వారిలో మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే రాజీనామా చేయగా, మిగతా ఐదుగురిపై ఒత్తిడి పెరుగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం గనుల కేసుల్లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ధర్మాన, సబిత ఇంద్రారెడ్డి సిబిఐ ఛార్జ్షీటులో నిందితులుగా కూడా నమోదయ్యారు. మిగిలిన మంత్రులపై కూడా త్వరలో సిబిఐ ఛార్జ్షీటు దాఖలు చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
ఆ స్థితిలో వారిని తొలగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ రావడమే కాకుండా స్వపక్షంలోని కొంత మంది నాయకులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులతో కూడా రాజీనామాలు చేయించాలని ముఖ్యమంత్రిని ఆదేశించవచ్చునని అంటున్నారు. ఢిల్లీ వెళ్లిన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆ విషయంపైనే అధిష్టానం పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. అలాగే 15వ తేదీన ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారని, ఆయనతో కూడా అధిష్టానం పెద్దలు కళంకిత మంత్రుల రాజీనామా అంశంపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పనున్నారని తెలుస్తోంది.
చార్జిషీట్లో నిందితులుగా పేర్లు నమోదైన ఇద్దరు మంత్రులతో ముందు రాజీనామా చేయిస్తారా, ఒకేసారి ఐదుగురిపై ఒకే విధమైన పద్ధతిని అనుసరిస్తారా అనేది తేలడం లేదు. అయితే త్వరలోనే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణంలో ఒకేసారి ఇంతమంది మంత్రులపై చర్యలు తీసుకుంటే దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2014 సాధారణ ఎన్నికల్లో కూడా కొంతవరకు లబ్ది పొందవచ్చునన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. ఆ స్థితిలో కళంకిత మంత్రులపై చర్యలు తప్పకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.