కెసిఆర్! ఢీకొంటా, నీ గుట్టు విప్పుతా: ఏకిపారేసిన రఘు
తాను కెసిఆర్ పైన ఈగ వాలినా ఊరుకోలేదని అలాంటి తనపై వేటు వేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిషలు కష్టపడడమే తెలంగాణ ద్రోహమా అని ప్రశ్నించారు. పార్టీకి ద్రోహం అంటే ఏమిటో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత, నాయిని నర్సింహారెడ్డిలు చెప్పాలన్నారు. తాను పార్టీ క్రమశిక్షణను ఎప్పుడు ఉల్లంఘించలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు ఉంటే తనకు షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదని, అర్ధరాత్రి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.
కెసిఆర్కు దమ్ముంటే తాను చేసిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలేంటో చెప్పాలన్నారు. 48 గంటల్లోకు తనకు సమాధానం రాకపోతే తెరాస ముఖ్య నేతల చిట్టా విప్పుతానన్నారు. అందరి జాతకం తన వద్ద ఉందన్నారు. వారు ఎవరెవరి నుండి ఎంతెంత మొత్తం తీసుకున్నారో, చెక్కు నెంబర్లతో సహా నిరూపిస్తానని, తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కూడా వారు నిరూపించాలని సవాల్ చేశారు. ఏ వేదిక అయినా తాను సిద్ధమేనన్నారు.
ఎవరి దగ్గర నుండి ఏం తీసుకొని తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని కెసిఆర్ను ప్రశ్నించారు. ఎక్కడి నుండి ఫోన్ వస్తే, ఎవరు చెబితే తనపై వేటు పడింతో తనకు తెలుసునని చెప్పారు. పదమూడేళ్లుగా పార్టీలో ఉండి కష్టపడుతున్న నేతలను పక్కకు పెట్టి.. చీమలు పెట్టిన పుట్టలోకి పాములను తీసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. మొదటి నుండి పని చేస్తున్న కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రఘునందన రావులు కాకుండా తెలంగాణకు ద్రోహం చేసిన కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ వంటి నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు.
కొందరు రాజకీయ నాయకులు 2004లో ఓ పార్టీలో, 2009లో ఓ పార్టీలో ఉండి ఇప్పుడు ఉద్యమం బలపడిన సమయంలో తెరాసలోకి వస్తున్నారని, అప్పటి నుండి పని చేసిన తమను కెసిఆర్ విస్మరిస్తున్నారన్నారు. కడియం లాంటి పాములను పార్టీలోకి వద్దని చెప్పానని అది తప్పా అని ప్రశ్నించారు. దీనిపై కెసిఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జెండాలు మోసే వారిని పక్కన పెట్టడమేమిటన్నారు. తాను చంద్రబాబును కలువలేదని వివరించారు.
అసదుద్దీన్ ఓవైసీని కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి, రేవంత్ రెడ్డిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నానని ప్రచారం జరుపుతున్నారన్నారు. ఓ వ్యక్తిని పార్టీలో నుండి బయటకు పంపించాలంటే మొదట పిచ్చి కుక్కగా ముద్ర వేయాలని కెసిఆర్ చెబుతుంటారని, తన విషయంలో కూడా అదే చేస్తున్నారన్నారు. కానీ, తాను కెసిఆర్ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన హరీష్ రావు పైన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
తెరాసను స్థాపించినప్పుడు తాను, తన ముసల్ది తప్ప తనకు ఎవరు లేరని, తెలంగాణ కోసమే చస్తామని చెప్పిన కెసిఆర్.. ఇప్పుడు తన కొడుకును, అల్లుడిని ఎమ్మెల్యేలుగా చేశారని, కూతురును ఎంపీగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారు ఎవరెవరి వద్ద నుండి ఎంతెంత వసూలు చేశారో వారే చెప్పాలని లేదంటే తాను ఆధారాలతో సహా నలభై ఎనిమిది గంటలలో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.
మహాకూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే హరీష్ రావు తనను ఓడించారని, కెటిఆర్ను సిరిసిల్లలో ఓడించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. గతంలో కెసిఆర్ను అధ్యక్ష పదవి నుండి తొలగించి తాను కూర్చునేందుకు హరీష్ చేసే ప్రయత్నాలతో తాను ఏకీభవించలేదని అప్పటి నుండి తనపై ఆయన కక్ష పెంచుకున్నారన్నారు. తన బాధను కెసిఆర్, కవిత, కెటిఆర్లకు ఏడ్చి మరీ చెప్పానని తెలిపారు.
తెలంగాణవాది అంటే ఏమిటో కెసిఆర్, ఆయన చెంచాలు తనతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలువరిస్తానన్నారు. ఇన్నాళ్లు ఉద్యమం కోసం తాను మాట్లాడలేదని, ఇప్పుడు మొదటి నుండి ఉన్నవారినే పక్కకు పెడితుంటే ఊరుకునేది లేదన్నారు. తనతో గొడవ పెట్టుకొని తెరాస యాజమాన్యం తప్పు చేసిందని, తెలంగాణకు ఇది మంచితే అయిందన్నారు.
మొదటి నుండి జెండాలు మోస్తున్న కెకె మహేందర్ రెడ్డి, జిట్టా, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రఘునందన రావులను కాదని డబ్బున్న వాళ్లకు కెసిఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిర్యాదులు రాత్రి పది తర్వాత అందుతాయా అని ప్రశ్నించారు. తనపై రాత్రి వేటు వేశారంటే ఏం జరిగింతో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విజయరామారావును కాదని తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
వెలమవాళ్లు ఎక్కువవుతున్నారని, తనకు సీటు ఇవ్వాల్సి వస్తుందని తనను తప్పిస్తారా అని ప్రశ్నించారు. వాపును చూసి కెసిఆర్ బలుపుగా ఫీల్ అవుతున్నారని దుయ్యబట్టారు. నేను భయపడేది లేదని, మీ బండారం అంతా బయటపెడతానని హెచ్చరించారు. తాను ఏ పార్టీలే చేరడం లేదన్నారు. ఇప్పటికైనా అధిష్టానం తనకు క్షమాపణలు చెప్పాలన్నారు. కెసిఆర్ 'పిచ్చికుక్క' సూత్రం తన వద్ద పని చేయదని అభిప్రాయపడ్డారు.
కెసిఆర్ పిరికి పంద అని, ఒక్క పార్టీ నేతతోనైనా ముఖాముఖి మాట్లాడే దమ్ము ఆయనకు లేదన్నారు. ప్రపంచ పిరికితనం అధ్యక్షుడు కెసిఆర్ అని ఎద్దేవా చేశారు. జయశంకర్ బతికుండగా రాజ్యసభ సభ్యుడిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కోదండరామ్ను కెసిఆర్ ఎంతలా తిట్టారో తనకు తెలుసునన్నారు. అందరిమీద బట్ట కాల్చేసినట్లు తన పైన కాల్చటేస్తే ఊరుకునేది లేదన్నారు. కెసిఆర్ గురించి, ఆయన మీడియా గురించి మొత్తం బయటపెడతానన్నారు.