రఘు టివి పులే: టిఆర్ఎస్, కార్యకర్తను చితకబాదారు
రఘునందన్ టివి పులి: తెరాస
రఘునందన రావు టివి పులి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి నేత రాజయ్య యాదవ్ బుధవారం అన్నారు. రఘునందన రావు చేసిన ఆరోపణలను ఆయన ఈ రోజు తెరాస భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చింది తెరాసనే అన్నారు. 2009 ఎన్నికల్లో పోటీ చేయమంటే వద్దన్న రఘునందన్.. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బలపడే సరికి పోటీ చేయాలని ఉవ్వీళ్లూరుతున్నారన్నారు.
ఎన్నికల్లో గెలవాలనే కుతూహలంతో ఆయన కెసిఆర్ పైన విమర్శలు చేస్తున్నారని, ఆయనకు ఆ స్థాయి లేదన్నారు. టిడిపి బలంగా ఉందా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉందా అని ఆయన లెక్కలు వేసుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని ప్రతి సవాల్ చేశారు. రఘునందన రావు ఎప్పుడు టివిల చుట్టే తిరిగారు తప్ప పార్టీ కోసం పని చేసింది లేదన్నారు. హరీష్ రావు పైన ఈర్ష్యతో మాట్లాడుతున్నారన్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
నల్గొండ జిల్లా సూర్యాపేటలో తెరాసలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సూర్యాపేటలో జరుగుతున్న పార్టీ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఇంఛార్జీ నియామకంపై వ్యతిరేకత ప్రదర్శించారు. జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రమేష్ అనే వ్యక్తిని ఆయన వర్గం చితకబాదింది. గాయాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు.