బాబుకు భయపడి మాట్లాడారు: కన్నాపై సోమయాజులు
సిబిఐని విమర్శిస్తే తన అధికార దుర్వినియోగంపై దర్యాప్తు జరుపుతారేమోనని బాబు భయపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. బాబు ఆదేశాలతో నడుస్తోన్న సిబిఐ ఒక్కొక్క కోర్టులో ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై పలు చార్జిషీట్లు వేసినా.. అంతిమంగా అన్నింటికీ కలిపి తుది చార్జిషీట్ వేస్తామని సిబిఐ చెప్తోందని అయితే, అనుబంధ చార్జిషీట్లపై విచారణ జరపాలని కోరటం చాలా విచిత్రంగా ఉందని, ఇది కచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.
జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్తో కలిసి బాబు చేస్తున్న కుట్రలను తన అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని సోమయాజులు విమర్శించారు. జగన్పై మొదట లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారని కానీ, బాబు డెరైక్షన్లోని సిబిఐ వేస్తున్న అన్ని చార్జిషీట్లను కలిపినా రూ. వెయ్యి కోట్లు లావాదేవీలు మాత్రమే జరిగాయని పేర్కొంది. అది కూడా కేసు 70 శాతం దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది.
తాజాగా గవర్నర్ను కలిసిన సందర్భంగా బాబు మాట్లాడుతూ రూ. 43 వేల కోట్లు అంటున్నారని, రూ. 57 వేల కోట్లు ఎక్కడ పోయాయని, ఆయన చెప్పేదాంట్లోనే స్పష్టత లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్ విషయంలోనూ రూ.10 వేల కోట్లు దుర్వినియోగం జరిగిందంటూ బాబు అనుకూల మీడియా దుష్ర్పచారం చేస్తే.. సిబిఐ దర్యాప్తులో మాత్రం ప్రభుత్వానికి రూ.43 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బాబు ఏం చెప్తే కాంగ్రెస్ అధిష్టానం తు.చ. తప్పకుండా పాటిస్తుందని.. ఆయన ఈ మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకొని గవర్నర్ను కలిసిన నేపథ్యంలో.. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆ భయంతోనే మాట్లాడారని సోమయాజులు వ్యాఖ్యానించారు. బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ జివోలు విడుదలయ్యాయని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కన్నా.. తాజాగా జగన్పై ఆరోపణలు చేస్తున్నారని, ఇలా విభిన్నంగా ప్రవర్తిస్తూ ప్రజలు, సుప్రీం కోర్టులో ఎవర్ని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తే ఆయనకు వంద ఏళ్లు జైలు శిక్ష వేసినా తక్కువే అవుతుందన్నారు.