మేం గేట్లు తీయలేదు: రఘుపై బాబు, కడియంపై ఫైర్
అవినీతి ఓ సమస్యే కాదన్నట్లుగా కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి కాంగ్రెసు నేతలు, కాంగ్రెసు అవినీతి గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట్లాడదన్నారు. అవినీతి మంత్రులపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
సుప్రీం కోర్టు సిబిఐ చిలుక పలుకులను పిల్ల కాంగ్రెసు తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు. బెయిల్ రాకపోతే తనపై ఆరోపణలు చేయడమేమిటన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయన్నారు. కోర్టులను నేను ప్రభావితం చేస్తాననడం సిగ్గుచేటు అన్నారు. అవినీతిపరులు అంతా ఒక్కటయ్యారని మండిపడ్డారు. ఓబుళాపురంపై పోరాడింది టిడిపియే అన్నారు.
జాతి సంపదను హవాలా ద్వారా విదేశాలకు పంపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వల్ల దేశ ఆర్థిక పరిస్థితే చిన్నాభిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపికి వ్యక్తులు ముఖ్యం కాదని, సమాజం ముఖ్యమన్నారు. కొందరు నేనేదో హత్యలు చేయించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.
రఘునందన్ కలయికపై...
తెరాస బహిష్కృత నేత రఘునందన రావు తనను కలువలేదని చంద్రబాబు చెప్పారు. తాను వాళ్ల మాదిరిగా రహస్యంగా కలువవని, ఎవరితోనైనా బహిరంగంగానే సమావేశమవుతామన్నారు. తాము గేట్లు తీయలేదని, తలుపులు మాత్రమే తీశామన్నారు. తమ పార్టీ బలంగా ఉంది కాబట్టే తమను టార్గెట్ చేశారని అన్నారు.
పదవులు ఇచ్చినప్పుడు కడియం శ్రీహరికి ముప్పయ్యేళ్లు పరిశుద్దంగా కనిపించి ఇప్పుడు చెడ్డవాడినయ్యానా అని ప్రశ్నించారు. టిడిపిలోకి వచ్చేందుకు చాలామంది క్యూలో ఉన్నారని, త్వరలో వారి వివరాలు బయటకు వస్తాయన్నారు. తమపై విమర్శలు చేసే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.