జోక్యం చేసుకోం: సబితా ఇంద్రారెడ్డి ఇష్యుపై షిండే
"మీరు కేంద్రంలో హోం మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా సిబిఐ చేర్చింది, మీరేమంటార"ని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. దీన్ని బట్టి సబితా ఇంద్రారెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వదిలేసినట్లు అర్థమవుతోంది.
కాగా, "తెలంగాణపై ఆందోళనలు సాగుతున్నాయి, తెలంగాణ ఎంపిలు పార్లమెంటులో ఆందోళన చేశార"ని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే ఆ విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని, తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను కలిసే అవకాశం ఉంది. రేపు గురువారం ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారు. సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంతో పాటు ఇతర కళంకిత మంత్రుల వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి అధిష్టానం పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది.