ఢిల్లీ గ్యాంగ్రేప్ నిందితుడికి విషమిచ్చారు: లాయర్
జైలులో తోటి ఖైదీలు శర్మను కొట్టారని, తోసివేశారని అన్నారు. శర్మ పరిస్థితిపై జైలు అధికారులు ఏమీ మాట్లాడడం లేదు. అతన్ని హుటాహుటిన మంగళవారం లోక్నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఛాతీ దెబ్బల కారణంగా అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. శర్మకు పెట్టిన ఆహారంలో విషం కలిపారని సింగ్ ఆరోపించారు.
స్లో పాయిజన్ వల్ల రక్తం వాంతులు జరుగుతున్నాయని అన్నారు. చాలా రోజులుగా అతని ఆహారంలో విషం కలుపుతున్నారని లాయర్ ఆరోపించారు. అతన్ని తొలుత జైలులోని క్లినిక్కు తరలించారని, ఆ తర్వాత నగరంలోని ఆస్పత్రికి మార్చారని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని మరణించిన విషయం తెలిసిందే. నడుస్తున్న బస్సులో రామ్ సింగ్, వినయ్ శర్మలతో పాటు మరో ముగ్గురు వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 16వ తేదీన ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత 13 రోజులకు బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది.