సీటు మారాలి!: ఎలక్షన్ కోసం నేతల సెలక్షన్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులు తమ సీటును మార్చాలనే యోచనలో ఉన్నారట. తమ తమ నియోజకవర్గాలలో మరలా గెలుపొందలేక, తెలంగాణ ప్రభావం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరాల కారణాలతో పలువురు నేతలు సీటు మార్చాలనే యోచనలో ఉన్నారట.
అసెంబ్లీ స్థానాలలో గెలుపుపై నమ్మకం లేని పలువురు నేతలు తమకు బాగుంటుందని, తమ పరిధిలోని పార్లమెంటు స్థానంపై కన్నేశారట. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖేష్ గౌడ్లు పార్లమెంటు స్థానాలపై కన్నేశారట. అదే సమయంలో ఎంపిలు పొన్నం ప్రభాకర్, లగడపాటి రాజగోపాల్, మధుయాష్కీలు తదితర ఎంపీలు కూడా తమ స్థానాలను మార్చుకోవాలనే యోచనలో ఉన్నారట.
పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న నేతలు... తమకు బాగుంటుందని భావిస్తున్న నియోజకవర్గాలకు షిఫ్ట్ కావడమే ఉత్తమమని భావిస్తున్నారట. అయితే, షిఫ్టింగ్లను పలువురు నేతలు కొట్టిపారేస్తున్నా.. ప్రచారం మాత్రం సాగుతోంది. తాను మరోసారి విజయవాడ నుండే పోటీ చేయాలని భావిస్తున్నానని అయితే అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని లగడపాటి చెబుతున్నారు.
టిడిపిలో రాజకీయ ఓనమాలు దిద్దిన కడియం శ్రీహరి బుధవారం తెరాసలో చేరారు. తన నియోజకవర్గంలో తన పట్ల వ్యతిరేకత ఉండటంతో మరోసారి గెలువలేననే ఉద్దేశ్యంతోనే అతను తెరాసలో చేరినట్లుగా చెబుతున్నారు. తెలంగాణవాదం పేరుతోని గట్టెక్కవచ్చునని ఆయన భావిస్తున్నారట. అతను స్టేషన్ ఘనపుర్ను విడిచి వరంగల్ పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారట. కెసిఆర్ నుండి హామీ కూడా వచ్చిందట.
ప్రస్తుతం నర్సాపూర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సునితా లక్ష్మారెడ్డి వచ్చేసారి మెదక్ పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారట. సబితా ఇంద్రా రెడ్డి కూడా చేవెళ్లపై కన్నేశారట. తన స్థానం నుండి తన తనయుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించారట.
కల్యాణదుర్గం నుండి గెలిచిన మంత్రి రఘువీరా రెడ్డి 2014లో హిందూపురం లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారట. విజయవాడపై మరోసారి అంతగా నమ్మకం లేని లగడపాటి రాజగోపాల్ కూడా సేఫ్ జోన్ కోసం వెతుకుతున్నారట. ఆయన గుంటూరు లేదా నెల్లూరు నుండి పోటీ చేసే అవకాశాలపై అప్పట్లో ఆరా తీశారట.
సికింద్రాబాద్ లోకసభ స్థానం పైన ముఖేష్ గౌడ్ కన్నేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని తనయుడికి అప్పగించి సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లాలని చూస్తున్నారు. దీంతో అప్పట్లో ఆయన ప్రస్తుత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో పరోక్ష వాగ్వాదానికి కూడా దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.
మంత్రి శ్రీధర్ బాబు ఈసారి కరీంనగర్ నుండి, పొన్నం ప్రభాకర్ వేములవాడ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మధు యాష్కీ మల్కాజిగిరికి మారాలనే ఆలోచన చేస్తున్నారట.