జగన్కు అన్యాయం, మంత్రుల అరెస్టేది?: శంకర రావు
కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై తాను పిటిషన్ వేసినప్పుడు మంత్రుల ప్రమేయం తనకు ఏమాత్రం తెలియదన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులను అరెస్టు చేయాల్సిందే అన్నారు. జగన్ను జైలులో ఉంచి మంత్రులను అరెస్టు చేయడం పోవడం సరికాదని శంకర రావు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వివక్ష చూపవద్దన్నారు.
కిరణ్పై పెద్దిరెడ్డి ఫైర్
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలు ప్రచారానికి మాత్రమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. ఈ రెండు పథకాల ప్రచారం కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. పేదలకు మాత్రం అవి ఉపయోగపడటం లేదన్నారు.
పుంగనూరులో కిలో చింతపండు రూ.35లకే దొరుకుతుందని, అయితే అమ్మహస్తంలో అరకిలో చింతపండు రూ.35కు ఇవ్వడం దారుణమన్నారు. అమ్మహస్తం బ్యాగ్ రూ.4లు అయితే రూ.11కు అమ్ముతున్నారని, ఇందులో ముఖ్యమంత్రి, మంత్రులకు ఎంత కమిషన్ వస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.