రికార్డ్స్ కోసం కాదు: రెండు వేలు దాటిన షర్మిల యాత్ర
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... సిబిఐ ఒక్కొక్కరి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో ప్రధానమంత్రికి, అక్కడి మంత్రులకు ఓ న్యాయం, రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ చనిపోయాక బోఫోర్స్ కేసులో ఆయన పేరును తీసేశారని, రాష్ట్రంలో మాత్రం వైయస్ చనిపోయినా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
షర్మిల మాట్లాడుతూ.. తాను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదని, జరుగుతున్న అన్యాయాలు, వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చేస్తున్నానని అన్నారు. వైయస్ పాదయాత్రకు కొనసాగింపే ఈ యాత్ర అన్నారు. జగన్ ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుందామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కుట్రలదారులను, నరకాసురలను సంహరించాలన్నారు. అప్పటిదాగా జరిగేది యుద్ధమే అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు కాంగ్రెసును రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చారని, కేంద్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు వైయస్సే కారణమని, ఆయన మరణించిన తర్వాత కాంగ్రెసు ఆయన కుమారుడిని వేధిస్తోందని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పిన మాటలే అందుకు నిదర్శనమని ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.