స్పాట్ ఫిక్సింగ్: మరిన్ని దాడులకు పోలీసులు రెడీ
ఫిక్సింగ్ ఈ ఐపియల్కు పరిమితం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అహ్మదాబాద్, ముంబైలకు వెళ్లినట్లు సమాచారం. కాగా, జైపూర్ పోలీసులు బుక్కీలకు చెందిన కాల్ రికార్డులను సమర్పించడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. గత రెండు నెలల కాలంలో వారు 300 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రమే పరిమితం కాలేదని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో ఇతర జట్లకు చెందిన మరి కొంత ఆటగాళ్ల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
చండిలకు, బుక్కీలకు మధ్య జరిగిన సంభాషణలను బట్టి చూస్తే నిరుటి మ్యాచుల ఫిక్సింగ్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. రూ. 20 లక్షల రూపాయల విషయంలో చెలరేగిన వివాదం సమయంలో చండిల మాట్లాడిన విషయాలు నిరుటి ఫిక్సింగ్ విషయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. నిరుడు కూడా జరగిందని, పరిష్కరించుకుందామని చండిల చెప్పిన మాటలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు.