జగన్ కేసు: కిరణ్కు చిక్కులు, ముగ్గురిలో టెన్షన్
జగన్ కేసులో సిబిఐ మరో ఐదు చార్జిషీట్లను మరో నాలుగు నెలల కాలంలో కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఐదు చార్జిషీట్లలో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మిగతా ముగ్గురు మంత్రులను కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య, జె గీతారెడ్డి వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రుల జాబితాలో ఉన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వారు ఈ జీవోలను జారీ చేశారు.
వైయస్ జగన్ మాత్రమే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందారని మంత్రులు ఎంతగా వాదించినప్పటికీ అది మంత్రులకు చుట్టుకుంది. ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలు చేయడంతో సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేస్తున్న కొద్దీ మిగతా మంత్రులు రాజీనామాలు చేసే పరిస్థితి రావచ్చు. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ అవకాశం ఉంది. ఆ కారణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో పడవచ్చు.
ఇద్దరు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. పునర్వ్యస్థీకరణ జరిపే సమయంలోనే గీతారెడ్డి, కన్నా, పొన్నాలలను ముఖ్యమంత్రి మంత్రివర్గం నుంచి తప్పించవచ్చునని కూడా అంటున్నారు. పార్టీకి వారి సేవలను ఉపయోగించుకుంటామనే కారణం చెప్పి వారిని మంత్రివర్గం నుంచి తప్పించవచ్చునని అంటున్నారు.