కెసిఆర్ని కలిసిన ముగ్గురు ఎంపీలు, ముహూర్తం
ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు పాలుపంచుకున్నారు. కెసిఆర్తో భేటీ అయిన ఎంపీలు రాజయ్య, వివేక్, మంద జగన్నాథం, కెకెలు జూన్ 3వ తేదిలోగా తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇక తెలంగాణ ఇవ్వదనే అభిప్రాయానికి వారు వచ్చినందు వల్లే తెరాసలో చేరేందుకు ముహూర్తం కోసం కెసిఆర్తో భేటీ అయ్యారని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమం జోరుగా ఉండటంతో పాటు అధిష్టానం వైఖరి కూడా వారికి అసంతృప్తిని కలిగిస్తోంది. తెలంగాణపై ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చుతామని చెబుతున్నారే కానీ నిర్దిష్ట సమయంలోగా తేల్చుతామని చెప్పడం లేదు. మరోవైపు వాయలార్ రవి తెలంగాణను కాఫీ, టీలతో పోల్చడం, పిసి చాకో తెలంగాణ తమ అజెండాలో లేదని నాలిక్కర్చుకోవడం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జీర్ణించుకోవడం లేదు.
కెకె, మంద జగన్నాథం, రాజయ్యలు ఆదివారం వివేక్ ఇంట్లో భేటీ అయిన విషయం తెలిసిందే. వారు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై అధిష్టానం తేల్చాలని లేదంటే తాము ఇతర పార్టీలలో చేరక తప్పదని హెచ్చరించారు కూడా.