జగన్ నిర్ణయం: యుపిఎను కాదనని వైయస్ భారతి
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందువల్లే జగన్ను జైలు పాలు చేశారని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకే జగన్ నడుచుకుంటారని 'సీఎన్ఎన్ ఐబీఎన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతి చెప్పారు. మరో ఏడాది తర్వాత ఉండే పరిస్థితులు, ప్రజల మనోభావాలను బట్టి కేంద్రంలో యూపీఏకు, రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతిచ్చే విషయం ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జగన్ నడుచుకుంటారని, వారి పక్షాన నిలిచినందుకే ఆయన జైలు పాలయ్యారు తప్ప అవినీతివల్ల కాదని అన్నారు. ఒకవేళ ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటే జగన్ మద్దతివ్వకపోవచ్చునని అన్నారు. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుందని భారతి చెప్పారు.
జగన్ జైలు నుంచి బయటపడటానికే రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ కు మద్దతిచ్చారా? అని ప్రశ్నిస్తే - పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ప్రణబ్పై గౌరవం, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం దృష్ట్యా తాము మద్దతు ఇచ్చామని చెప్పారు. యూపీఏతో అలాంటి ఒప్పందమే చేసుకోవాలనుకుంటే చాలా రోజుల క్రితమే జగన్ బయటకు వచ్చి ఉండేవారని భారతి అన్నారు.