రామోజీ రావు స్క్రిప్ట్, సాక్షి తప్పేంటి?: కిరణ్కు గట్టు
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలందరూ ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని పల్లెత్తు మాట అనకుండా ప్రజాపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తూలనాడటానికే సమయం వెచ్చించారన్నారు. అదే విధంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు, చంద్రబాబు హయాంలో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొస్తున్నందుకే సాక్షిపై అక్కసు వెళ్లగక్కుతున్నారా? అని గట్టు ప్రశ్నించారు.
తప్పులను ఎత్తిచూపడమే సాక్షి తప్పా? అన్నారు. నాణేనికి రెండో కోణాన్ని చూపుతున్నందుకు ఎల్లో మీడియా మొత్తం జట్టుగా ఏర్పడి సాక్షిపై విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో జగన్ టివి, ఛానల్ పెట్టారన్న వ్యాఖ్యలపై గట్టు మండిపడ్డారు. రెండు న్యూస్ చానళ్లను, కృష్ణా పత్రిక అనే దిన పత్రికను నడిపించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు.
ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిరణ్ నడిపిస్తున్న పత్రిక ఏ అక్రమ పుత్రికనో ఆయనే స్పష్టం చేయాలన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ న్యూస్ చానెల్ కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడిదో బయటపెట్టాలన్నారు. కిరణ్, బొత్సలు న్యూస్ చానెళ్లు, పత్రికలు కొనుగోలు చేస్తున్నా వాటిపై విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ ప్రశ్నించరన్నారు. బాబు బినామీలైన రామోజీ, రాధాకృష్ణల మీడియా సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై కిరణ్ విచారణ జరపరని అన్నారు.
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక మానసిక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ పిచ్చికూతలు కూస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఆనం సోదరులు పచ్చి అవకాశవాదులని దుయ్యబట్టారు. మంత్రి ఆనం శాడిస్టు అయితే, ఆయన సోదరుడు వివేకానంద పగటి వేషగాడంటూ నిప్పులు చెరిగారు. అబద్ధాలను చాలా అందంగా, కనురెప్ప కొట్టకుండా చెప్పగల నేర్పరి బాబు అని విమర్శించారు. రూ.వెయ్యి, రూ.500 నోట్లు వెలువడడానికి ముఖ్యకారణమైన చంద్రబాబే వాటిని తొలగించడానికి ఉద్యమం చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.