పురంధేశ్వరికి సోనియా షాకిస్తారా?: టిఎస్సార్కు సిగ్నల్స్
పురందేశ్వరిపై కొంతకాలంగా సుబ్బిరామి రెడ్డి చేస్తున్న రాజకీయ, మానసిక పోరులో ఆయనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. గత ఎన్నికల్లోనే తాను విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకున్నానని, అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందువల్ల.. వచ్చేసారి తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటానని అధిష్ఠానం చెప్పిన విషయాన్ని ఆయన సోనియాకు గుర్తు చేశారట.
ఆయన అభ్యర్థనను సోనియా వ్యతిరేకించకపోగా విశాఖలో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అమలు చేసి పార్టీ పరిస్థితి మెరుగుపరచాలంటూ కోరడంతో సుబ్బిరామిరెడ్డికి సానుకూల సంకేతాలు లభించాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2009లో విశాఖ నుంచి తాత్కాలికంగా పురందేశ్వరి పోటీ చేస్తే బాగుంటుందని తానే సూచించి, గెలిపించేందుకు కృషి చేశానని ఆయన సోనియాకు చెప్పారు.
నిజానికి విశాఖ పట్టణంలో పురందేశ్వరికి ఏ మాత్రం సంబంధాలు లేవని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయం సాధించకపోవచ్చని ఆయన తెలిపారట. నరసరావుపేట నియోజకవర్గం నుంచి పురందేశ్వరి పోటీ చేయడం, ఆమెకు, పార్టీకి రాజకీయంగా మంచిదని దీనిపై దృష్టి సారించాలని మేడమ్కు సుబ్బిరామి రెడ్డి వివరించారట.
తాను 32 ఏళ్లుగా విశాఖకు సేవ చేస్తున్నానని, ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నానని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో విశాఖను కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు ఐదేళ్లలో 40 లక్షల మొక్కలు నాటాలన్న తన ప్రణాళికను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులకు తాను అమలు చేస్తున్న కార్యక్రమాలను, విశాఖ అభివృద్ధిలో ఇతర పారిశ్రామిక సంస్థలకు భాగస్వామ్యం కల్పించి అమలు చేస్తున్న పథకాలను సోనియాకు వివరించారట.
ఈ వివరాలన్నీ విన్న ఆమె.. 'వెరీగుడ్. ఇలాగే చేయండి. గో ఎహెడ్..' అని తనను అభినందించారని, విశాఖలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారని సుబ్బిరామి రెడ్డి సూచించారట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాగా పని చేస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న పథకాల వల్ల కాంగ్రెస్ పట్ల జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని, గత ఏడాదితో పోలిస్తే పార్టీ పరిస్థితి ఎంతో మెరుగైందని వివరించారు.