వడదెబ్బకు మహిళ... తల్లి కోసం ఏడ్చి చిన్నారి మృతి
తల్లీ కూతుళ్లను వడదెబ్బ బలి తీసుకుంది. వలసకూలీ అయిన అనిత అనే మహిళ వడదెబ్బ కారణంగా ఈ రోజు ఉదయం మృతి చెందింది. తన తల్లి కోసం రెండేళ్ల కూతురు తులసి దాదాపు గంటలుగా ఏడ్చి ఏడ్చి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచి వేసింది. నిన్న అస్వస్థతకు గురైన అనిత ఈ రోజు మృతి చెందింది.
ఈ రోజు రామగుండంలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లాలో ఐదుగురు, అదిలాబాదు జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలో ముగ్గురు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, ఖమ్మం, విశాఖపట్నం, కడప, చిత్తూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఎండ తీవ్రత దృష్టా ఇంట్లోనుండి బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే టోపీ, కళ్లజోడు ధరించి రావాలని, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వాస్తవ ఉష్ణోగ్రతలు చెప్పడం లేదు: కోదండరామ్
వాస్తవ ఉష్ణోగ్రతలను బయట పెట్టడం లేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. ఎండకు ప్రజలు చనిపోతున్నా చర్యలు తీసుకోవడం లేదని, జాతీయ విపత్తు సలహా మండలి స్పందించాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, శాశ్వత ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యాలయాలకు, సింగరేణి కార్మికులకు సెలవులివ్వాలన్నారు.