మండుతున్న సూర్యుడు: 293 మంది మరణం
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో నలుగురు, మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో 13 మంది, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, కరీంనగర్ జిల్లాలో 29 మంది, నల్లగొండ జిల్లాలో 27 మంది, ఖమ్మం జిల్లాలో 23 మంది, వరంగల్ జిల్లాలో 20 మంది, మెదక్ జిల్లాలో ఏడుగురు, హైదరాబాదులో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
రాష్టవ్య్రాప్తంగా అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదుకాగా, కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీలు కూడా నమోదైంది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, విశాఖపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో 43నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు తోడు కావడంతో పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని అధికార్లు చెబుతున్నారు.
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్తోపాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. మెదక్, హైదరాబాద్లో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక్కడ 49 వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇళ్లు దాటి వెళ్లొద్దని అధికార్లు హెచ్చరికలు చేశారు. అత్యవసర పనులపై వెళ్లాల్సినవారు, ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంట నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇలాఉండగా, వడగాడ్పులకు మరణించిన దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద 50వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మృతులకు సంబంధించి పోలీసు కేసు నమోదైన పత్రాలతోపాటు, పోస్టుమార్టం నివేదిక ఉండాలని అధికారులు వెల్లడించారు.