పిట్టల దొర, దివాళా స్థితిలో: కెసిఆర్పై యాష్కీ నిప్పులు
థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే ఎవరితో పొత్తు పెట్టుకొని కెసిఆర్ తెలంగాణ సాధిస్తారని ప్రశ్నించారు. యూపిఏ, ఎన్డీయే వంటి జాతీయ పార్టీలు లేకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నారు. తెలంగాణను అడ్డుకున్న వైయస్ రాజశేఖర రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావులను ధీటుగా తాను ఎదుర్కొన్నానని అన్నారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు లాంటి వారిని కూడా ఎదిరించానన్నారు.
విరాళాలు ఉద్యమానికి ఉపయోగపడాలి కానీ కెసిఆర్ సొంత ఆస్తులు పెంచుకునేందుకు కాదన్నారు. కెసిఆర్, కెవిపిలకు ఉన్న సంబంధమేమిటో చెప్పాలని నిలదీశారు. అదిగో తెలంగాణ.. ఇదిగో తెలంగాణ అంటూ ఉద్యమం పేరుతో వేలాది మందిని బలితీసుకున్నారని, ఇప్పుడేమో 100 అసెంబ్లీ, 15 ఎంపి సీట్లు వస్తే తెలంగాణ వస్తుందని చెబుతున్నారని మండిపడ్డారు. 100 సీట్లు గెలిచినా 194 ఇతరుల చేతిలో ఉంటాయన్నారు.
ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, జాతీ పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలే లక్ష్యమైతే ఉద్యమాలెందుకు, అమాయకుల ప్రాణత్యాగాలెందుకన్నారు. కెసిఆర్ ప్రస్తుతం దివాళా తీసే పరిస్థితులో ఉన్నారని, తెలంగాణలో ఆయన దొరతనం పోయిందని, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆస్తులెంత, ఇప్పుడెంతో చెప్పాలని సవాల్ చేశారు. ఉద్యమం ద్వారా ఆస్తులు పెంచుకుంటూ ఫాంహౌస్లో పచ్చనోట్ల పాన్పుపై పడుకునే వారు గొప్పా అన్నారు.
తాము ఎక్కడా బతుకమ్మ పండుగ కోసం రూ.5 కోట్లు చొప్పున ఖర్చు చేయలేదన్నారు. కుటుంబ సభ్యులను రంగంలోకి దించలేదన్నారు.. జాగీర్లు పంచుకోలేదని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోమని కాంగ్రెసు పార్టీ ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెసు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలను తెరాసలోకి తీసుకొని వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా తెస్తారన్నారు. తాను అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తామన్నారు.