విందుతో భార్య ఫోటో: చిన్నబోయిన ధోనీ, మీడియాకి నో
కోల్కతా: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మీడియాకు మరోసారి ముఖం చాటేశాడు. మీడియాకు ధోనీ దూరంగా ఉండటం రెండు రోజుల్లో ఇది రెండోసారి. కోల్కతాలో ఐపిఎల్ ముంబై ఇండియన్స్తో ఐపిఎల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశానికి ధోనీ దూరంగా ఉన్నాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సారథులు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడాల్సి ఉండగా చివరి నిమిషంలో ఇరుజట్ల కోచ్లు మాత్రమే పాల్గొన్నారు. మీడియా ఎదుటకు మహేంద్ర సింగ్ ధోనీ రావడానికి ఇష్టపడకపోవడమే అందుకు కారణం.
మ్యాచ్ పూర్తయ్యాక జరిగిన సమావేశానికి కూడా అతడు దూరంగా ఉన్నాడు. ధోనీని కోచ్ స్టీపెన్ ఫ్లెమ్మింగ్ వెనుకేసుకొచ్చాడు. ధోనీ సాధారణంగానే మీడియాకు దూరంగా ఉంటాడనే విషయం మీకందరికీ తెలుసునని ఫ్లెమ్మింగ్ ధోనీని వెనుకేసుకొచ్చాడు. ఏవైనా జట్టు విషయాలను తాను చెబుతానని అన్నాడు.
కారణం అదేనా?
ధోనీ ముభావంగా, మీడియాకు దూరంగా ఉండటానికి కారణం తమ జట్టు సిఈవో గురునాథ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టు కావడంతో పాటు తన సతీమణి సాక్షి సింగ్ ధోనీ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్తో కలిసి మ్యాచ్ చూడటం చర్చనీయాంశం కావడమే కావొచ్చునని అంటున్నారు.