ఈడెన్లో అవమానం: శ్రీనివాసన్కు వెక్కిరింతలు
కోల్కతా: రాజీనామా చేయనంటూ మొండికేస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్కు అవమానం తప్పలేదు. ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులు అతన్ని అవహేళన చేశారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవం సందర్ఫంగా ఆదివారం రాత్రి అతన్ని గేలి చేశారు.
వ్యాఖ్యాత రవిశాస్త్రి - శ్రీనివాసన్ పేరు ప్రకటించిన వెంటనే మైదానంలోని వేల మంది ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ అతన్ని వెక్కిరించారు విన్నర్ ట్రోఫీ అందించే సమయంలో కూగా గేలి చేశారు. దాదాపు 61 వేల మంది ప్రేక్షకులు ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచును వీక్షించడానికి వచ్చారు.
కామన్వెల్త్ క్రీడల ముగింపు ఉత్సవంలో అప్పటి భారత కామన్వెల్త్ సంఘం చీఫ్ సురేష్ కల్మాడీకి ఎదురైన అనుభవమే శ్రీనివానస్కు ఈడెన్ గార్డెన్లో ఎదురైంది. తన అల్లుడు గురునాథ్ మేయప్పన్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టు అయినప్పటికీ బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి శ్రీనివాసన్ నిరాకరిస్తున్నారు.
నేవీ బ్లా స్యూట్, స్కై బ్లూ షర్ట్ ధరించిన శ్రీనివాసన్ మైదానంలోకి అడుగు పెట్టాడు. అతను విచారంగా కనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచులేవీ శ్రీనివాసన్ చూడలేదు. ఫైనల్ మ్యాచ్ పూర్తవుతుందనగా వచ్చారు. నిజానికి, ఆయన రాకపోవచ్చునని అనుకున్నారు. కానీ ఊహలను తలకిందులు చేస్తూ ఆయన ముగింపు కార్యక్రమానికి వచ్చారు. ఫైనల్ మ్యాచ్ అనంతర కార్యక్రమానికి టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా వచ్చారు.
కాగా, శ్రీనివాసన్ రాజీనామా చేస్తాడా, చేయడా అనే విషయంపై కూడా జోరుగా బెట్టింగులు జరుగుతున్నాని సమాచారం. ఇప్పటికే పందేలు రూ. 50 కోట్లు దాటాయని ఓ బుకీ చెప్పాడంటూ వార్తాకథనాలు వస్తున్నాయి. ఢిల్లీ, కోల్కతా బుకీలు శ్రీనివాసన్పై పందేలు స్వీకరిస్తున్నారని సమాచారం.