స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చండిల గొడవ పడ్డారు
న్యూఢిల్లీ: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో అరెస్టయిన క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిల పోలీసు కస్టడీలో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య తీవ్రమైన వాగ్వివాదం గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్లోకి లాగి తన జీవితాన్ని, కెరీర్ను పాడు చేశావని శ్రీశాంత్ చండిలను నిందించినట్లు సమాచారం.
తనపై ఎడతెరిపి లేకుండా శ్రీశాంత్ ఆరోపణలు చేస్తుండడంతో ఆగ్రహించిన చండిల ఎదురుదాడికి దిగినట్లు చెబుతున్నారు. ఇరువురు కొట్టుకునేంత పనిచేయడంతో పోలీసుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని శాంతపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. తమకు బెయిల్ ఇవ్వడానికి బదులు ఢిల్లీ సాకేత్ కోర్టు తమ పోలీసు కస్టడీని పొడిగించడంతో శ్రీశాంత్తో పాటు ఇతర ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనైనట్లు చెబుతున్నారు.
సిసిటివి ఫుటేజ్ టీవీ చానెళ్లలో ప్రసారమైనప్పటి నుంచి శ్రీశాంత్ మరింత ఉద్విగ్నతకు లోనైనట్లు చెబుతున్నారు. సిసిటివి ఫుటేజ్లో చండిఘర్ హోటల్లో చవాన్తో పాటు శ్రీశాంత్ బుకీలతో, అమ్మాయిలతో ఉన్న దృశ్యాలు ఉన్నాయి.
ఇదిలావుంటే, చండిలతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న మరో ముగ్గురు బుకీలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. భూపేందర్ నగర్ను గ్రేటర్ నోయిడాలో, సయ్యద్ దురేజ్ అహ్మద్, సునీల్ సక్సేనాలను హైదరాబాదులో అరెస్టు చేశారు. వారిని మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. వారిని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.