కాదన్నా: కాంగ్రెస్ గూటికి జగన్, ఎన్డీయేకి బాబు సలాం?
మరోవైపు బిజెపి తెలంగాణవాదం గతంలో కంటే బలంగా వినిపించడం, 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని టిడిపి మరోసారి చెప్పి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం తెరాసను కలవరపాటుకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో జగన్, తెరాస హవా అని చెప్పిన సర్వేలు కూడా ఇప్పుడు వాటి హవా తగ్గిందని చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది.
జగన్ పార్టీ కాదు కాదంటూనే...!
కాంగ్రెసు, టిడిపిలు కుట్ర చేసి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టించాయని, కాంగ్రెసు, టిడిపిలు వచ్చే ఎన్నికలలో మాయా కూటమిగా కలిసి పోటీ చేస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తూనే... వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ప్రాధాన్యతను బట్టి, ఏ కూటమి గెలుస్తుందో చూసుకొని జాతీయస్థాయిలో మద్దతిస్తామని చెబుతోంది. ఎన్డీయే కూటమికి మద్దతివ్వమని కుండబద్దలు కొడుతూనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏకు మాత్రం మద్దతివ్వమని గట్టిగా చెప్పలేక పోతోంది.
తద్వారా యూపిఏ అధికారంలోకి వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలోను ఎవరికీ సాధారణ మెజార్టీ రాకుండా కాంగ్రెస్ - వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు దానికి తగ్గ స్థానాలు గెల్చుకుంటే ఆ కూటమి ప్రభుత్వమే ఏర్పడటం లేదా విలీనం కావడం తప్పదంటున్నారు. జగన్ పార్టీ ప్రస్తుతం చేస్తున్న టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కు ప్రచారం అంతా తమ బలం పెంచుకోవడానికేనని, తీరా ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెసుతో కలిసిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పలువురు కాంగ్రెసు నేతలు కూడా జగన్ ఎప్పటికైనా తమ పార్టీలో విలీనం కాక తప్పదంటున్నారు.
దూరం దూరం అంటూనే టిడిపి...!
ఇక ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు బిజెపికి, కాంగ్రెసుకు తాము సమ దూరమని చెబుతున్నా 2014 తర్వాత ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు. జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ కోసమే బాబు తొలి ప్రయత్నాలు అని చెబుతున్నారు. అయితే రాష్ట్ర, జాతీయ పరిస్థితులను బట్టి టిడిపి వైఖరిలో మార్పు ఉంటుందంటున్నారు.
రాష్ట్రంలో టిడిపికి పూర్తి మెజార్టీ రాని పక్షంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపి ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెల్చుకుంటే జాతీయస్థాయిలో బాబు ఎన్టీయేకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. థర్డ్ ఫ్రంట్ రాకుండా రాష్ట్రంలో మంచి మెజార్టీ వస్తే మాత్రం ఎన్డీయేకు దూరం పాటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకొని టిడిపి నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. ఇప్పటికే టిటిడిపి నేతలు బిజెపితో పొత్తుకు అనుకూలంగా ఉన్నారు.