రాజీనామా: విప్ మీద ఎమ్మెల్యేలపై టిడిపి కొత్త ట్విస్ట్
టిడిపికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై విప్ ధిక్కార కేసు కింద అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు టిడిపి ఫిర్యాదు చేసింది. అందులో ఆరుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలా చారి, చిన్నం రామకోటయ్య ఓటింగ్కు దూరంగా ఉన్నారు. వీరిలో హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసం ప్రతిపాదనపై సంతకం చేసినా ఓటింగ్లో పాల్గొనలేదు.
వేణుగోపాలా చారి, రామకోటయ్య ఆ రోజు సభకు హాజరుకాలేదు. పార్టీ విప్ తమకు అందలేదని వీరు చెబుతున్నారు. మంగళవారం స్పీకర్ సమక్షంలో విచారణ జరగనున్న నేపథ్యంలో టిడిపి కొత్త వ్యూహానికి పదును పెట్టింది. ఈ మేరకు గతంలో హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలా చారి పార్టీ, శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించడాన్ని, చిన్నం రామకోటయ్య ఎన్నికల సంఘానికి రాసిన లేఖలను సాక్ష్యాలుగా పేర్కొంటూ వారిపై 2(1)బీ కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరింది.
మంగళవారం హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలా చారి, రామకోటయ్య స్పీకర్ ఎదుట విచారణకు హాజరైనప్పుడు విప్ ధిక్కార కేసుతో పాటు.. రాజీనామాల గురించిన ప్రస్తావన వచ్చింది. ఇదే విషయాన్ని టిడిపి విప్ ధూళిపాళ్ల నరేంద్ర వాదించారు. అయితే.. ఒకేసారి రెండు వాదనలు విన్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ మనోహర్ ఎమ్మెల్యేపై 2(1)బీ కింద మరో పిటిషన్ వేయాలని సూచిస్తూ ఈ కేసును జులై ఒకటో తేదీకి వాయిదా వేశారు.
స్పీకర్ మనోహర్ సూచన మేరకు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, రామకోటయ్యలపై బుధవారం 2(1)బీ కింద ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధమైంది. కాగా.. తమపై టిడిపి వేసిన ధిక్కార కేసు నిలిచే అవకాశాల్లేనందునే రాజీనామాల అంశాలతో కొత్త కేసుకు సిద్ధమైందని ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, రామకోటయ్యలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీకి రాజీనామా చేసిన మరుక్షణమే శాసనసభా సభ్యత్వాలను కోల్పోతారని.. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా స్పీకర్కు ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయనున్నామని టిడిపి విప్ నరేంద్ర చెప్పారు.