భజ్జీతో గొడవతోనే శ్రీశాంత్ దావూద్ దృష్టిలో పడ్డాడా?
బెంగళూర్: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న పేసర్ శ్రీశాంత్ స్పిన్నర్ హర్భజన్ సింగ్తో గొడవనే రొంపిలోకి దింపిందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2008లో హర్భజన్ సింగ్తో చెంప దెబ్బ తిన్న సమయంలోనే శ్రీశాంత్పై అండర్ వరల్డ్ డాన్స్ దృష్టి పడిందని అంటున్నారు. శ్రీశాంత్ను లక్ష్యంగా చేసుకోవాలని అప్పుడే దావూడ్ ఇబ్రహీం సోదరుడు అనీస్ భావించినట్లు, 2008లోనే శ్రీశాంత్పై వల విసరాలని బుకీలకు సూచించినట్లు చెబుతున్నారు.
శ్రీశాంత్ వంటి సీనియర్ ఆటగాడిని ముగ్గులోకి లాగితే మరింత మంది జూనియర్లను లాగవచ్చునని అనీస్ బుకీలతో చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన పలువురు బుకీలు ఈ విషయం ఢిల్లీ పోలీసులతో చెప్పినట్లు పుకార్లు షికారు చేస్తు్నాయి. శ్రీశాంత్ను 2008లోనే లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 2013లో గానీ ముగ్గులోకి దింపలేకపోయామని బుకీలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
శ్రీశాంత్కు వల వేసే పనిని అనీస్ బుకీ సునీల్కు అప్పగించాడని, సునీల్ ఆ పనిని రామేష్ వ్యాస్, జూపిటర్ అలియాస్ చంద్రేష్ జైన్లకు అప్పగించాడని, చివరగా ఆ పనిని జిజూ జనార్దన్ అలియాస్ బిజూకు అప్పగించారని, శ్రీశాంత్తో పాటు అజిత్ చండిలను, అంకిత్ చవాన్లకు వలవేయడంలో అతను విజయం సాధించాడని అంటున్నారు.
దిమ్మ తిరిగే జీవనశైలిని రుచి చూపించడంతో వారు ముగ్గురు కూడా వలలో పడ్డారని అంటున్నారు. విలాసవంతమైన జీవనశైలి ఆశపడి, బజ్జీతో గొడవతో అసంతృప్తికి గురై శ్రీశాంత్ తమ వలకు చిక్కాడని బుకీలు చెప్పినట్లు సమాచారం. ఎస్కార్టులను నియమించి శ్రీశాంత్ కదలికలను బుకీలు తెలుసుకుంటూ వచ్చారు. వాటిని రికార్డు చేశారని, ఆ రికార్డులతో శ్రీశాంత్ను బ్లాక్ మెయిల్ చేశారని అంటున్నారు. అండర్ వరల్డ్కు ఐపియల్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధం ఉందని పోలీసులు ఇప్పటికే నిర్దారించారు.