టిఎస్సార్ పరువు 5 కోట్లేనా?, చిట్టా విప్పుతా: దగ్గుబాటి
తనపై రూ.5కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్న టిఎస్సార్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రూ.5 కోట్లు ఆయన పరువుకు తక్కువవుతుందేమోనని ఎద్దేవా చేశారు. సుబ్బిరామి రెడ్డి సిమెంటును బ్లాక్లో అమ్ముకున్నారని ఆరోపించారు. జిహెచ్ఎంసికి కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన ఘనత ఆయనదే అన్నారు.
కాగా అంతకుముందు విశాఖలో టిఎస్సార్ మీడియాతో మాట్లాడారు. తనపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంగతి తానే చూసుకుంటానని అన్నారు. దగ్గుపాటిపై తాను క్రిమినల్ కేసు పెడతానని, పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తాను రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకే కాంగ్రెసు పార్టీలో చేరానని అన్నారు. తాను గెలిచినా గెలవకపోయినా విశాఖ ప్రజలకు సేవ చేశానన్నారు.
దశాబ్దాలుగా విశాఖ ప్రజలకు సేవ చేస్తున్నానని కాబట్టే తాను ఆ సీటును కోరుతున్నానని చెప్పారు. సీటును కోరుకోవడంలో తప్పేంటన్నారు. తాను ఎప్పుడు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావును విమర్శించలేదన్నారు. విశాఖతో ఉన్న అనుబంధం వల్లే తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విశాఖ టిక్కెట్ను కోరానని చెప్పారు. పలుమార్లు తాను దగ్గుపాటికి సహకారం చేశానన్నారు.
దగ్గుపాటి ఓ జంపింగ్ నేత అన్నారు. దగ్గుపాటి పనికిరాడని టిడిపి భావిస్తే ఆయన బిజెపిలోకి వెళ్లిపోయారని, అక్కడ వాళ్లు తట్టుకోలేకపోవడంతో కాంగ్రెసు పార్టీలోకి వచ్చారన్నారు. నాగార్జున సాగర్ డ్యాం వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న ఆయనకు ఏం తెలుసునని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ సిమెంటు కేసుపై దగ్గుపాటి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు.