ఫిరాయింపు కాదు: కెసిఆర్, తెరాసలోకి ఇద్దరు ఎంపీలు
ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే వారు తెరాసలోకి వస్తున్నారని, వీరిని తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంకొందరు తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ సాధన కోసం అందరు ఏకతాటి పైకి రావాలన్నారు.
అప్పుడే బలీయమైన శక్తిగా ఎదిగి రాష్ట్రం సాధించుకుంటామన్నారు. ఎంపీల చేరిక ఉద్యమానికి బలమిచ్చే నిర్ణయమన్నారు. వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్యపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. తెలంగాణపై కేంద్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. అందుకే ఎంపీలు తెరాసలో చేరుతున్నారన్నారు.
రాత్రి వరకు వేచి చూస్తాం: కెకె
తాము తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన కోసం ఈ రోజు వరకు గడువిచ్చామని, రాత్రి వరకు వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత జూన్ 2వ తేదిన తెరాస బహిరంగ సభలో పాల్గొంటామన్నారు. కేంద్రం నిర్ణయం చెప్పకుంటే తెరాసలో చేరి తెలంగాణ సాధించుకుంటామన్నారు. జూన్ 2న చేరికపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు. మీడియా సత్యాలు రాసే ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు.
తాము స్వార్థం కోసం తెరాసలో చేరబోవడం లేదన్నారు. తాను ఎన్నికలలో పోటీ చేయానని చెప్పారు. ఉద్యమిస్తున్నంత మాత్రాన ఎన్నికలలో పోటీ చేయడం తప్పు కాదన్నారు. తనతో చాలామంది టచ్లో ఉన్నారని, వారంతా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమకు ఎన్నికలు ప్రధానం కాదని, తెలంగాణ ముఖ్యమన్నారు. తెరాసతో కలిసి తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పదవుల కోసం తాము ఆ పార్టీలో చేరడం లేదన్నారు.
స్వపక్షంలో
ఉండి
ఉద్యమించాం:
మంద
జగన్నాథం
తాము అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులమై ఉండి ఉద్యమాలు చేశామని మంద జగన్నాథం అన్నారు. సభలో అడ్డుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్ష కోసమే తాము ఉద్యమంలో పాల్గొంటామన్నారు. కావూరి సాంబశివ రావు కాంగ్రెసును తిట్టినప్పటికీ ఆయనను అధిష్టానం బుజ్జగించిందన్నారు. తాము దళితులమనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తెలంగాణపై పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త నీరు పోతే పాత నీరు వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళితే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు బాధ్యత ఉంటుందని, ఆయన మాత్రం వెళ్లేవారు వెళ్తారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు సిద్ధాంతం ఇచ్చిన మాట తప్పడమేనా అని బొత్సను ప్రశ్నించారు. తాము సిద్ధాంతాలు లేని పార్టీలో తాము ఉండదల్చుకోలేదన్నారు. రాత్రి వరకు అధిష్టానానికి గడువు ఉందన్నారు.
తెలంగాణపై అధిష్టానం తీరు బాధించందని, డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని వివేక్ అన్నారు. తెరాసలోకి రాకలు ఇవి ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు ఇంకా ఉంటాయని ఈటెల రాజేందర్ చెప్పారు.