ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్గా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ
ఆయనను ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్గా నియమించినట్లు తెలుస్తోంది. ముంబై నగర పోలీసు కమిషనర్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు క్రైమ్ బ్రాంచ్ చీఫ్ కావడం గమనార్హం. ముక్కుసూటితనం, తన పని తాను చేసుకుపోవడం, విమర్శలను లెక్క చేయకపోవడం, వృత్తితోపాటు సమాజ సేవను ప్రవృత్తిగా ఎంచుకోవడం... ఇవన్నీ లక్ష్మీ నారాయణను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ఇతర అధికారులకు, యువతకు ఆయన స్ఫూర్తినిచ్చారు.
సర్వీసు నిబంధనల ప్రకారం ప్రతి ఐపిఎస్ అధికారి కనీసం ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లక్ష్మీ నారాయణ సిబిఐకి వెళ్లారు. 2006 జూన్ 12న మన రాష్ట్రానికి వచ్చారు. సత్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సిబిఐలో ఐదేళ్ల సర్వీసు పూర్తయ్యాక 2011లో ఆయన తిరిగి మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉండింది. అప్పుడే అత్యంత కీలకమైన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఆ వెంటనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తును సిబిఐ చేపట్టింది. దీంతో సిబిఐలో లక్ష్మీనారాయణ సర్వీసును ఏడాది పొడిగించారు. ఆ గడువు గత ఏడాదితో ముగిసింది.
జగన్ అరెస్టు అయిన వెంటనే జెడిని బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించడంతో లక్ష్మీ నారాయణ సర్వీసును మరో ఏడాది పొడిగించారు. ఈ సంవత్సరంతో ఆ గడువు కూడా ముగుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగించే అవకాశం లేకపోవడంతో... జూన్ 11లోగా రిలీవ్ కావాలని జెడికి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఆయన జూన్ 7న రిలీవ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఓఎంసి కేసులో చార్జిషీట్ల దాఖలు దాదాపుగా పూర్తయింది. జగన్ అక్రమాస్తుల కేసులో తుది చార్జిషీటు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంది. సిబిఐ ఇంకా ఎవరినీ నియమించలేదని... కొన్నాళ్లపాటు వెంకటేశ్ ఇన్చార్జిగా కొనసాగుతారని తెలుస్తోంది.