తప్పుడు వార్తంటూ సాక్షి ఆఫీస్పై గుడ్లు, భారతిపై ఫైర్
ఏ ఆధారంతో ఈ వార్త రాసారో మీరు నమ్మే బైబిల్ పట్టుకొని ప్రమాణం చేసి చెప్పాలని, 24 గంటల్లోగా ఆ పత్రికను నడుపుతున్న భారతి ఈ వార్తకు ఆధారాలు చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పత్రిక కార్యాలయాల ముందు పత్రిక ప్రతులను తగులబెడతామని, ఇంటింటికీ తిరిగి ఈ పత్రిక బిసిలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తామని హెచ్చరించారు. తనకు టిక్కెట్టు ఇస్తే ఖాయంగా పోటీ చేస్తానని, వేరే వారికి ఇస్తున్నానని చెబితే వారి గెలుపు కోసం కూడా విద్యార్ధులందరం కలిసి ప్రచారం చేసి గెలిపిస్తామని చెప్పారు.
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొడుకు కెటిఆర్తో తాను సమావేశం అయ్యానని రాశారని, తాను కనుక్కొంటే కెటిఆర్ నేపాల్లోనో.. దుబాయ్లోనే ఉన్నాడని తెలిసిందని, అక్కడకు వెళ్ళి మాట్లాడటానికి తనకు కనీసం పాస్పోర్టు కూడా లేదన్నారు. తాను పేద బీసీ నేతనని, పెట్టుబడికి, కట్టుకధకు పుట్టిన పుత్రిక ఆ పత్రిక అని మండిపడ్డారు.
ఆంజనేయ గౌడ్పై రాసిన వార్తను నిరసిస్తూ టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ముందు జగన్ పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆ పత్రిక కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్ళేందుకు బయలుదేరగా ఆంజనేయ గౌడ్ సహా ఆ సంఘ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం జగన్ పత్రిక నిర్వాహకులపై ఆంజనేయ గౌడ్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగన్ మీడియాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకు ముందు జగన్ పత్రికలోని కథనానికి నిరసనగా కొందరు విద్యార్థి నాయకులు ర్యాలీగా ఆ పత్రికా ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి స్టేషన్కు వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం వారిని విడుదల చేశారు.