నేనెక్కే కారుకు డిఫెక్ట్స్ ఉన్నాయి, తెలుసు: కెకె
తెలంగాణ సాధన కోసం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్ని శక్తులనూ సమీకరించారని, తెలంగాణ కోసం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని, తెలంగాణ పట్ల చిత్తశుద్ధిని చూసి తాను తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. బిజెపి కూడా తెలంగాణ కోసం కృషి చేస్తోందని, తాను బిజెపి జాతీయ నాయకులతో కూడా మాట్లాడానని, అయితే బిజెపి వల్ల లౌకికభావన సమస్య తలెత్తుతోందని అన్నారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, కాంగ్రెసు తెలంగాణ ఇవ్వబోదని ఆయన అన్నారు.
కాంగ్రెసులో ఉండి తెలంగాణ కోసం పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులందరినీ ఏకం చేశానని, రాజీనామాలకు సిద్ధపరిచానని ఆయన చెప్పారు. కాంగ్రెసులో ఓ వర్గం అధికారానికి దగ్గరగా ఉందని, దానివల్ల సమస్య వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే తనను బఫూన్ అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2000లలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ కోసం కాళ్లు పట్టుకున్న సందర్భాలున్నాయని, ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్పినవారున్నారని గుర్తు చేశారు.
తెలంగాణను చులకనగా చూస్తున్నారని కెకె అన్నారు. తెలంగాణ కోసం మాటలు చెప్తే, పాటలు పాడితే సరిపోదని, ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటాలని ఆయన అన్నారు. ఎన్ని ఉద్యమాలు చేయాలో అన్ని ఉద్యమాలు చేశామని, ప్రజల్లో పోరాట పటిమను పెంచామని, తెలంగాణపై నమ్మించి పక్కకు జరగారని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష ఎన్నికల ద్వారా వ్యక్తమవుతుందని ఆయన చెప్పారు. ఉద్యమపార్టీ కాబట్టి తెరాసకు ఓటు వేయాలని ాయన అన్నారు. రాజకీయ స్వార్థంతో పార్టీ మారడం లేదని ఆయన అన్నారు. తనకు తెలంగాణ కావాలని, ఉద్యమ పార్టీ తెరాస ద్వారానే తెలంగాణ సాధన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ చాలా పాత డిమాండ్ అని ఆయన అన్నారు.
కాంగ్రెసు నాయకత్వం నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తోందని మందా జగన్నాథం అన్నారు. కావూరి సాంబశివరావును పిలిచి మాట్లాడిన కాంగ్రెసు నాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తాము పదవులు అడగడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. దళితుడైన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను అవమానించారని, కాంగ్రెసు దళితులకు చేసే సేవ ఇదేనా అని ఆయన అన్నారు.
పార్టీని వీడాలనుకునేవారిని పిలిచి మాట్లాడుతారని, కానీ పాత నీరు వెళ్తుంటే, కొత్త నీరు వస్తుందని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన అన్నారు. ఎన్నాళ్లుంటావో చెప్పలేని స్థితి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. అన్ని సీట్లు గెలుస్తానని ధైర్యంగా చెప్పగలవా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఓ ప్రాంతీయవాది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కాళ్లు, వేళ్లు పట్టుకోవాలని తాము అడగలేదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని అడిగామని అన్నారు.
తెలంగాణ ఇస్తేనే మీతో ఉంటామని కాంగ్రెసు నాయకులకు తాము చెప్పినట్లు జి. వివేక్ చెప్పారు. తెలంగాణ సాధనే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తమ నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ వనరులు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.