తీర్పు వచ్చే వరకు...: జెడిని బదలీ చేయొద్దంటూ ఫ్లెక్సీ
ఈ నేపథ్యంలో ఆయనను బదలీ చేయవద్దంటూ వరంగల్ జిల్లాలో రైట్ వే ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. 'ఓ కేంద్ర ప్రభుత్వమా.. మా రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు బయటకు తీసిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ గారిని వాటి తీర్పు వచ్చే వరకు మా రాష్ట్రంలోనే ఉంచండి... ప్రజలారా ఆలోచించండి. రాష్ట్ర భవిష్యత్తుకై' అని ఫ్లెక్సీలో రాసింది.
మాజీ మంత్రి శంకర రావు కూడా రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కేసుల దర్యాఫ్తు పూర్తయ్యే వరకు జెడిని ఇక్కడే ఉంచాలని కోరారు. జగన్ కేసులో మంత్రులు రాజీనామా చేసిన సమయంలో ఆయనను బదలీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన అన్నారు.
కాగా, లక్ష్మీ నారాయణ తిరిగి తన సొంత కేడర్ అయిన మహారాష్ట్రకు ఈ నెల 14న వెళ్లనున్నారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఏడేళ్లపాటు సిబిఐలో అది కూడా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన లక్ష్మీనారాయణను తిరిగి మహారాష్ట్రకు పంపించారు. ఆయనను ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్గా నియమించారు. ముంబై నగర పోలీసు కమిషనర్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు క్రైమ్ బ్రాంచ్ చీఫ్ కావడం గమనార్హం.
సర్వీసు నిబంధనల ప్రకారం ప్రతి ఐపిఎస్ అధికారి కనీసం ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లక్ష్మీ నారాయణ సిబిఐకి వెళ్లారు. 2006 జూన్ 12న మన రాష్ట్రానికి వచ్చారు. సత్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సిబిఐలో ఐదేళ్ల సర్వీసు పూర్తయ్యాక 2011లో ఆయన తిరిగి మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉండింది.
అప్పుడే అత్యంత కీలకమైన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఆ వెంటనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తును సిబిఐ చేపట్టింది. దీంతో సిబిఐలో లక్ష్మీనారాయణ సర్వీసును ఏడాది పొడిగించారు. ఆ గడువు గత ఏడాదితో ముగిసింది. జగన్ అరెస్టు అయిన వెంటనే జెడిని బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించడంతో లక్ష్మీ నారాయణ సర్వీసును మరో ఏడాది పొడిగించారు. ఈ సంవత్సరంతో ఆ గడువు కూడా ముగుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగించే అవకాశం లేకపోవడంతో... జూన్ 11లోగా రిలీవ్ కావాలని జెడికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.