చివరిదాకా బేరసారాలు: ఎంపీలపై ఆజాద్ ఘాటు వ్యాఖ్య
దీనిపై ఆజాద్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారంతా తమతో బేరసారాలు చేసే వెళ్లారన్నారు. పార్టీని వీడిన వారు బంధువులు, కుటుంబ సభ్యుల కోసమే వెళ్లారన్నారు. వారికి తెలంగాణ కంటే తమ వాళ్ల ప్రయోజనాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలన్నారు.
పార్టీని వీడిన వారికి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారు ఇంకెవరు పార్టీని వీడరని ఆయన చెప్పారు. తెలంగాణపై ఈ నెలలోనే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ చెప్పారు. కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని వీడటం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమన్వయం ఉండేలా అనేక చర్యలు చేపట్టినట్లు ఆజాద్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రకు చెందిన వారైనా ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని సమావేశాలు నిర్వహించి ఈ నెలలోనే తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించామని చెప్పారు.
ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు
ఆజాద్ వ్యాఖ్యల పైన ఎంపీలు వివేక్, మంద జగన్నాథం స్పందించారు. తాము ఏం బేరసారాలాడామో ఆజాద్ చెప్పాలన్నారు. వారమంటే ఏడు రోజులు, నెలంటే ముప్పై రోజులు కాదన్న ఆజాద్ తాజా గడువుకు ఎన్నిరోజులో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చిన మాటను తప్పినందువల్లే తాము తెరాసలో చేరుతున్నామని మంద జగన్నాథం అన్నారు.