తప్పు చేయలేదు: విజయసాయిరెడ్డి, పార్టీ బాధ్యతలపై..
శనివారం వారు తుమ్మల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ సాయి మాట్లాడుతూ... ప్రభుత్వం కనుసన్నుల్లోనే సిబిఐ, ఈడి కొందరిపై రాజకీయంగా కక్ష సాధించేందుకు కేసులు నమోదు చేస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను, మంత్రులను బలి చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
సిబిఐ అధికార పార్టీలో పావుగా ారిందని, రెండు నెలలకే పూర్తి చేయాల్సిన ఛార్జీషీట్ ప్రక్రియను రెండేళ్లుగా పొడిగిస్తూ తమను మానసిక క్షోభకు గురి చేస్తోందన్నారు. తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఎక్కడా లేవన్నారు. సిబిఐ, ఈడి వద్ద తప్పు చేసినట్లు ఆధారాలు లేవని, త్వరలోనే నిర్దోషులుగా బయటకు వస్తామన్నారు. తన రాజకీయ ఆరంగేట్రంపై ప్రశ్నకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు.
కాగా, విజయ సాయి రెడ్డి తన భార్య తరఫు బంధువు అని, అందుకే తాను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వచ్చానని హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న అన్నారు. రాజకీయాలు వేరు.. కుటుంబం వేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫునే ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసేందుకు సిద్ధమని తారక రత్న ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు.