రాజీనామాపై శ్రీనివాసన్ 'డిమాండ్స్' మెలిక: శుక్లా రిజైన్
ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ తనను నిర్దోషిగా తేల్చితే మళ్లీ అధ్యక్ష పదవిని అప్పగించాలి. తనను వ్యతిరేకించి రాజీనామా చేసిన జగ్దాలె, షిర్కెను కొత్త ప్యానెల్లోకి తీసుకోరాదు. ఐసిసిలో భారత ప్రతినిధిగా తాను ప్రస్తుతమున్న పదవిలో కొనసాగించాలి.
తాత్కాలిక అధ్యక్షుడిగా బోర్డులో ఉన్న వ్యక్తికే అవకాశమివ్వాలి. మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పదవి చేపడతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ షరతు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఖాళీ అయ్యే కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవుల్లో తాను చెప్పిన వారినే నియమించాలి. కాగా కొన్ని డిమాండ్లను బోర్డు ఒప్పుకునేలా కనిపించడం లేదు.
బోర్డులోకి మళ్లీ రాను: సంజయ్
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేసిన బిసిసిఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలె.. మళ్లీ బోర్డులోకి రానని చెబుతున్నారు. ప్రస్తుతానికి రాజీనామా చేసినప్పటికీ పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు శనివారం తెరదించాడు. 'బిసిసిఐలోకి మళ్లీ రావాలని భావించడం లేదు. నా ఇన్నింగ్స్ ముగిసిందనే అనుకుంటున్నా' అని జగ్దాలె పేర్కొన్నాడు.
శుక్లా రాజీనామా
బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఒకరోజు ముందు ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తన పదవికి గుడ్బై చెప్పాడు. దీంతో శ్రీనివాసన్పై మరింత ఒత్తిడి పెరిగినట్టయింది. 'ఐపిఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా. గత కొంతకాలంగా దీనిపై తర్జన భర్జనల అనంతరం తీసుకున్న నిర్ణయమిది. జగ్దాలె, షిర్కె రాజీనామా ప్రకటించిన త ర్వాత నేను కూడా వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావించాన'ని శుక్లా వెల్లడించాడు.