జగన్ ములాఖత్లు తగ్గాయి: టిడిపిపై భూమన ఫైర్
తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం వల్ల జగన్కు ఉండాల్సిన ములాఖత్లు కూడా తగ్గిపోయాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు జైళ్ల మాన్యువల్ను ఓసారి చదువుకుంటే మంచిదని ఆయన సూచించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏనాడైనా కాంగ్రెసు పార్టీ పూర్తి పేరు ఉచ్చరించారా అని భూమన కరుణాకర్ రెడ్డి అడిగారు.
కాంగ్రెసు పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడి పేరు బొత్స సత్యనారాయణ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ రాజకీయ పరిజ్జానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ జెండాలో ఉన్న పథకాలన్నీ కాంగ్రెసు పథకాలనే వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
కాంగ్రెసు పథకాలే అయితే ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఆ పథకాలు ఎందుకు లేవని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెసు నాయకులకు తమను ప్రశ్నించే హక్కు లేదని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్ష పదవికి న్యాయం చేయలేని బొత్స సత్యనారాయణకు ఇతరులను విమర్శించే హక్కు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జలీల్ ఖాన్, గౌతంరెడ్డి సోమవారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వోక్స్ వ్యాగన్ కంపెనీని రాష్ట్రానికి రానీయకుండా అవినీతి ఆరోపణలు తెచ్చుకున్న ఘనత బొత్స సత్యనారాయణదని వారన్నారు.
బొత్స ఏ శాఖ నిర్వహిస్తే ఆ శాఖపై ఆరోపణలు వస్తాయని వారు అన్నారు. తన కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇప్పించుకుని వైయస్ కుటుంబాన్ని విమర్శించడం బొత్సకు తగదని ఆయన అన్నారు.