కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదు: షకీల్ అహ్మద్
తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం పడుతుందని షకీల్ అహ్మద్ అన్నారు. తెలంగాణపై చర్చలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలుసాగుతున్నాయని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఆజాద్ మాత్రమే వివరించగలరని ఆయన అన్నారు. పూర్తి వివరాలు ఆజాద్కు మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా - ఎంపీల వ్యవహారంపై ఆజాద్ పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారని ఆయన జవాబిచ్చారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, జి. వివేక్తో పాటు సీనియర్ నేత కె. కేశవ రావు తెరాసలో చేరిన నేపథ్యంలో తెలంగాణపై ఎఐసిసికి చెందిన నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. నెల రోజుల్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ ఆదివారం చెప్పారు. సోమవారం షకీల్ అహ్మద్ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారు.