హీట్: సిటీకి డిఎల్ - ఆజాద్తో చిరు, బొత్స భేటీ
విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చాలా హుషారుగా కనిపించే ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన లేదని ఆయన అన్నారు. అన్నీ రేపు మాట్లాడుకుందామని, తొందరేమీ వద్దని ఆయన అన్నారు. రేపు మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తనకు బర్తరఫ్ గురించి ఎవరూ సమాచారం ఇవ్వలేదని, తనతో హైకమాండ్ నేతలు మాట్లాడలేదని ఆయన చెప్పారు. తనను బర్తరఫ్ చేసినందుకు సతోషమని, ఇప్పటి నుంచి తాను స్వేచ్ఛాజీవిని అని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని వీడబోనని చెప్పారు.
ఇదిలావుంటే, డిఎల్ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ సోమవారంనాడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను బొత్స సత్యనారాయణ ఢిల్లీలో కలిశారు. దాదాపు మూడు గంటల పాటు బొత్స ఆజాద్తో చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై బొత్స సత్యనారాయణ ఆజాద్కు వివరించినట్లు సమాచారం.
కాగా, కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి బొత్స సత్యనారాయణకు ముందే ఆజాద్ను కలిశారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని చిరంజీవి వర్గాలు అంటున్నాయి. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై వివరించడానికే చిరంజీవి ఆజాద్ను కలిసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్యను కూడా మంత్రివర్గం నుంచి తప్పించవచ్చుననే ప్రచారం సాగుతోంది. సి. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవి సూచన మేరకే రామచంద్రయ్యకు మంత్రివర్గంలో చోటు లభించింది. ఈ స్థితిలో ఆజాద్తో చిరంజీవి బేటీ ప్రాధాన్యం సంతరించుకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయన కూడా ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. డిఎల్ వ్యవహారంపైనే కాకుండా తెలంగాణపై కూడా రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, బొత్స సత్యనారాయణతో ఆజాద్ తెలంగాణపై చర్చ సాగినట్లు సమాచారం. తెలంగాణపై అటో ఇటో తేల్చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్టానం పెద్దలు తెలంగాణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు ప్రాంతాల నాయకులతో కాంగ్రెసు అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.