మా ఓటుబ్యాంక్గా మారింది, బోత్స లిక్కర్ డాన్: షర్మిల
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాత్రమే ఉన్నారని, ప్రజలు లేరన్న విషయాన్ని వారు గమనించాలన్నారు. వైయస్, జగన్ అవినీతిపరులని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని, అయితే ఆయన ఓ పెద్ద మద్యం మాఫియా డాన్ అన్న విషయం మరిచిపోవద్దన్నారు. వైయస్పై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు స్వయంగా తనపై ఎంక్వరీలు వేసుకునేవారని, కాని బొత్సపై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో అధికారులను బదిలీ చేయించారన్నారు.
జగన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే మంత్రో, లేక ముఖ్యమంత్రో అయ్యి ఉండేవారని గతంలో గులాం నబీ ఆజాద్ అన్న మాటలను మరవద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస సమయంలో పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కాలంలో ఎన్నికలలో ఆ రెండు పార్టీలకుప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంక్ ఎప్పుడో తమదై పోయిందని ఆ విషయానని బొత్స గుర్తించాలన్నారు. జగన్ దోషి అని ఏ కోర్టు చెప్పలేదని, ఆయనపై ఉన్నది రాజకీయ కేసు తప్ప మరొకటి కాదన్నారు.
హోమ్గార్డుకు గాయాలు
రోప్ బ్యాచ్ అత్యుత్సాహం వల్ల షర్మిల పాదయాత్రలో ఒక హోమ్గార్డు గాయాల పాలయ్యాడు. ఓ గ్రామంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా రోప్ బ్యాచ్, కొందరు యువకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఈ క్రమంలో బయటనుంచి గుర్తు తెలియని వ్యక్తి రోప్ బ్యాచ్ పైకి రాయి విసరగా ఆ రాయి హోమ్గార్డు అనిల్ తలకు బలంగా తగలడంతో అతడిని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.