జియా మిస్టరీ: సిల్క్ స్మిత, దివ్యభారతి (పిక్చర్స్)
ముంబై: నటి జియా ఖాన్ ఆత్మహత్య బాలీవుడ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, బాలీవుడ్ సినీ ప్రపంచంలో ఇటువంటి విషాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గురుదత్, దివ్య భారతి, సిల్క్ స్మిత వంటివారి జీవితాలు విషాదాంతం కావడాన్ని ఈ సంఘటన గుర్తు చేసింది.
బాలీవుడ్లో దివ్య భారతి మరణం అత్యంత విషాదకరమైంది. ఆమె 1993లో 19 ఏళ్ల వయస్సులో భవనం ఐదో అంతస్థు నుంచి కింద పడి మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా కిందికి తోశారా అనేది అంతు పట్టని విషయంగానే మిగిలిపోయింది. విశ్వాత్మ, షోలా అవుర్ షబ్నం, దీవానా తదితర చిత్రాల ద్వారా దివ్యభారతి బాలీవుడ్లో తన సత్తా చాటింది.
ఇక అత్యంత గ్లామరస్ హీరోయిన్గా ప్రఖ్యాతి పొందిన పర్వీన్ బాబీ 2005లో ముంబై తన ఫ్లాట్లో ఒంటరిగా మరణించింది. రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీ పోలీసులను అప్రమత్తం చేసే వరకు ఆమె మరణవార్త బయటి ప్రపంచానికి తెలియలేదు. మూడు రోజుల పాటు తలుపు వద్ద ఉన్న పాలను, వార్తాపత్రికలను ఆమె తీసుకోలేదని, దీంతో రెసిడెన్షియల్ సెక్రటరీకి అనుమానం వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా, సహజంగానే మరణించిందా అనేది ఇప్పటికీ మిస్టరీయే.
అమర్ అక్బర్ ఆంథోనీ, కూలీ, పర్వరిష్ వంటి ప్రజాదరణ పొందిన సినిమాలను తీసిన మన్మోహన్ దేశాయ్ మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ముంబైలోని గ్రాంట్ రోడ్డులో 1994లో భవనంపై నుంచి పడి మరణించాడు. తర్వాతి సినిమాలు విజయం సాధించకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరిగింది. దాంతో పాటు వెన్ను నొప్పి కారణంగా అతను కిందపడిపోయాడనే మరో కథనం కూడా ఉంది.
ప్రముఖ సినీ దర్శకుడు గురు దత్ విషాదాంతమైన జీవితం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన 1964లో విపరీతంగా మద్యం సేవించి, నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మరణించాడని అంటారు. ఆ రకంగా అతను మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడనే ఊహాగానాలు చెలరేగాయి. గురు దత్ ప్రమాదవశాత్తు మరణించాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. భార్య దూరంగా కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై గురు దత్ మరణించాడని అంటారు.
సిల్క్ స్మితగా మారిన విజయలక్ష్మి మరణం ఇప్పటికీ మిస్టరీయే. ఆమె విషం సేవించి 1996లో మరణించింది. 17 ఏళ్ల పాటు 450 సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత నిర్మాతగా మారడానికి ప్రయత్నించింది. అయితే, పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదు. ప్రేమ వైఫల్యం, డిప్రెషన్, తాగుడు ఆమె మరణానికి కారణాలు అని చెబుతారు.
దిల్ హై దిల్ మే సినిమా ఫేమ్ కునాల్ సింగ్ ముంబైలోని తన అపార్టుమెంటులో 2008లో ఉరివేసుకుని మరణించాడు. అది ఆత్మహత్య కాదని, తన కుమారుడని హత్య చేశారని కునాల్ సింగ్ తండ్రి ఆరోపించాడు.
సామాన్య ప్రేక్షకులనే కాదు, మేధావి వర్గానికి చెందిన ప్రేక్షకులను కూడా గురు దత్ ఊపేశాడు. ఆయన ప్యాసా ఇప్పటికీ మరుపురాని సినిమానే. అటువంటి గురు దత్ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.
పర్వీన్ బాబీ గురించి ఒకప్పటి హిందీ సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె జీవితం అత్యంత విషాదాంతమైంది.
దివ్య భారతి మరణం అప్పట్లో తీవ్ర సంచలనం. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
సిల్క్ స్మిత గురించి ఇప్పుడు ఎవరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను తన మత్తు కళ్లతో, అందాలతో ఉర్రూతలూగించిన ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇప్పుడు జియా ఖాన్ మరణం బాలీవుడ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జియా మరణానికి కారణం కూడా ఏమీ తెలియడం లేదు.